ఆంధ్రా ఊటీ అరకులో... అచ్చమైన గిరిజన దుస్తుల్లో మెరిసిన మహిళా ఎంపీలు (వీడియో)
అరకు ఎంపీ గోడ్డేటి మాధవితో పాటు కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కేరళ అల్తుర్ ఎంపీ రమ్య హరిదాస్ తో కలిసి సాంప్రదాయ గిరిజన వేషధారణలో తళుక్కున మెరిసారు.
అరకు: కేవలం ప్రకృతి అందాలనే కాదు అడవి బిడ్డల జీవనశైలి, సాంప్రదాయాలను చూడాలంటే వెంటనే ఆంధ్రా ఊటీ అరకు వెళ్లాల్సిందే. ''గిరి గ్రామ దర్శన్'' పేరుతో గిరిజన సంస్కృతీ సాంప్రదాయలతో పాటు పచ్చని అడవితల్లి ఒడిలో వారి జీవనశైలిని నేటి తరాలకు చూపించేందుకు విశాఖ జిల్లా అరకులో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్య్రమానికి గిరిజన వేషధారణలోనే హాజరయ్యారు స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవి.
సహచర కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కేరళ అల్తుర్ పార్లమెంట్ సభ్యులు రమ్య హరిదాస్ తో కలిసి ఎంపీ మాదవి అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలోని " గిరి గ్రామ దర్శన్" సందర్శించారు. ముగ్గురు మహిళా ఎంపీలు అచ్చ గిరిజన వేషధారణలో మెరిసారు. కేవలం గిరిజన సాంప్రదాయ దుస్తులను అలంకరించుకోవడమే కాదు ఆ గిరిజన ప్రజలతో ఎంపీలు మమేకమయ్యారు. తిరగలి తిప్పుతూ... రోకలిలో సామలు దంచుతూ అచ్చమైన గిరిజన మహిళల లాగే కాసేపు సమయం గడిపారు.
వీడియో
ఈ సందర్భంగా ఎంపీ మాధవి మాట్లాడుతూ... కనుమరుగవుతున్న గిరిజన సంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా అచ్చమైన గిరిజన సంప్రదాయాలను తిలకించాలి అనే పర్యాటకులకు అరకు మండలం పెదలబుడు గ్రామంలోని " గిరి గ్రామ దర్శన్ " సందర్శించవలసిందిగా కోరారు.