సీఎం గారూ... జలజగడంపై ఇలా చేయండి, ఫలితం ఉంటుంది: జగన్ కు రఘురామ లేఖ
తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచవద్దని నవసూచనల పేరిట తాజాగా సీఎం జగన్ కు రాసిన లేఖలో రెబల్ ఎంపీ రఘురామ పేర్కొన్నారు.
న్యూడిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజాగా శుక్రవారం మరో లేఖ రాశారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొన్న జలవివాదంపై లేఖలో ప్రస్తావించారు రఘురామ. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచవద్దని నవసూచనల పేరిట తాజాగా రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు.
''ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తమ రాష్ట్రాల ప్రయోజనాలకంటే రాజకీయ అవసరాల కోసం జలవివాదాన్ని పెద్దది చేస్తున్నారు. ఈ నీటి గొడవను ఇంకా పెంచి పెద్దది చేయవద్దు'' అని రఘురామ సూచించారు.
''తెలంగాణలోని ఆంధ్రా ప్రజల గురించి ఆలోచిస్తున్నానని అనడం విడ్డూరంగా వుంది. పొరుగున వున్న తెలంగాణ రాష్ట్రంలో సత్సంబంధాలు కొనసాగిస్తామని... దీని వల్ల ఎన్నో సమస్యలకు సత్వర పరిష్కారం జరుగుతుందని అన్నారు. అలాంటి ఇప్పుడు జల వివాదాలను ఎందుకు పరిష్కరించలేక పోతున్నారు?'' అని జగన్ ను ప్రశ్నించారు రఘురామ.
read more మా చెల్లికి పెళ్లి... జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్లుంది జగన్ తీరు: మరో లేఖలో రఘురామ ఎద్దేవా
''నదీ జలాల విషయంలో ఇటీవల మీరు మాట్లాడిన మాటలపై ఇరు రాష్ట్రాల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నదీ జలాల వివాదంపై ప్రధానికి లేఖ రాయడం వల్ల సత్వర పరిష్కారం లభించదన్న విషయం మీకూ తెలుసు. కాబట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమై జలవివాదాన్ని పరిష్కరించుకోవాలి'' అని జగన్ కు సూచించారు ఎంపీ రఘురామ.
ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటికే తొమ్మిది లేఖలు రాయగా నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరికొన్ని లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గురువారం తెలుగురాష్ట్రాల మధ్య జలవివాదంపై మరో లేఖ రాశారు.