చంద్రబాబు, పవన్ కృష్ణార్జునులు... మోదీ జెండాపై కపిరాజు : రఘురామ కామెంట్స్ అర్థమిదేనా?
వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ఱంరాజు టిడిపి, జనసేన పార్టీల్లో ఏదో ఒకదాంట్లో చేరనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం బహిరంగసభలో ఇరుపార్టీల అదినేతల ముందే తనకు తాను నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా కూడా ప్రకటించుకున్నారు.
తాడేపల్లిగూడెం : తెలుగుదేశం-జనసేన పార్టీలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగడమే కాదు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అటు టిడిపిలో గానీ, ఇటు జనసేనలో గానీ చేరకపోయినా తానే కూటమి అభ్యర్థినని స్వయంగా ప్రకటించుకున్నారు. ఇది కూడా స్వయంగా పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్... లక్షలాదిమంది టిడిపి, జనసేన శ్రేణుల ముందే ప్రకటించడం విశేషం.
టిడిపి, జనసేన కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి ప్రారంభించింది. తెలుగు జన విజయకేతనం ''జెండా'' పేరిట టిడిపి, జనసేన పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహించాయి. ఈ సభకు హాజరైన రఘురామ కృష్ణంరాజు నరసాపురం కూటమి అభ్యర్థిగా తనకు తానే ప్రకటించుకున్నారు.
టిడిపిలో లేడు... జనసేనలో లేడు... ఆ ధరిద్రపు పార్టీని ఇంకా వదల్లేదు... మరి వీడెందుకు వచ్చాడని మీరు అనుకోవచ్చు. ఆ సైకాసురున్ని గద్దె దింపడంకోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఈగోను పక్కనబెట్టారు. వారిని అభినందించేందుకే తాను టిడిపి-జనసేన సభకు వచ్చినట్లు రఘురామ తెలిపారు. ఓ దుర్మార్గున్ని అంతం చేయడానికి... ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కృష్ణార్జునుల్లా ఒకే వేదికపైకి వచ్చారని రఘురామ అన్నారు.
Also Read ఇక మీ ఖర్మ... నేనేమీ చేయలేను..: పవన్, చంద్రబాబుకు జోగయ్య ఘాటు లేఖ
151 మంది అభినవ కౌరవులను ఓడించే కురుక్షేత్రం తన నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి ప్రారంభం అవుతోందని... అందువల్లే ఈ సభకు హాజరయ్యాయని రఘురామ పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కృష్ణార్జునులైతే ప్రధాని నరేంద్ర మోదీ జెండాపై కపిరాజు అనిఅన్నారు. టిడిపి, జనసేన కలుస్తుందని చెప్పా... అలాగే జరిగింది... నాలుగైదు రోజుల్లో మరో అద్భుతం జరగబోతోందని రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
వైఎస్ జగన్ ఇక చరిత్రపుటల్లో కలిసిపోవడం ఖాయమని రఘురామ అన్నారు. మూడు రాజధానులు అంటూ రాజధాని అమరావతిని సర్వనాశనం చేసారని మండిపడ్డారు. రాజధాని లేకుండా చేసిన రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసారని రఘురామ ఆరోపించారు.
అధినేతలే అన్నదమ్ముల్లలా కలిసిపోయారు... కాబట్టి బేషజాలు పక్కనబెట్టి జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసిపోవాలి... చిన్నచిన్న విబేధాలను పక్కనబెట్టి సర్దుకుపోవాలని రఘురామ సూచించారు. త్వరలోనే మీ దగ్గరకు వస్తాను... అప్పుడు ఇంతకంటే భారీ సభను నిర్వహిస్తానని అన్నారు. పార్టీలో చేరకున్నా జై తెలుగుదేశం, జై జనసేన, జై బిజెపి అంటున్నానని రఘురామ కృష్ణంరాజు నినాదించారు.