తెలుగుదేశం-జనసేన కూటమి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వేళ కాపు సంక్షేమ సేన షాకిచ్చింది. ఇకపై ఈ కూటమికి దూరంగా వుండనున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు హరిరామ జోగయ్య ప్రకటించారు. 

అమరావతి : వరుస లేఖలతో జనసేన పార్టీకి, అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు సలహాలు, సూచనలు ఇస్తూ వస్తున్నారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య. అయితే తాజాగా ఆయన పవన్, చంద్రబాబులకు ఓ సంచలన లేఖ రాసారు. ఇకపై తాను జనసేన, తెలుగుదేశం పార్టీలకు ఎలాంటి సలహాలు ఇవ్వబోనని హరిరామ జోగయ్య వెల్లడించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తెలుగుదేశం, జనసేన కూటమి బాగుకోరి నేను ఇప్పటివరకు సలహాలు ఇచ్చాను... కానీ చంద్రబాబు, పవన్ లకు అవి నచ్చినట్లు లేవు.... అది వారి ఖర్మ... ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ జోగయ్య బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇరుపార్టీల పొత్తు నుండి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వరకు ఆయన ఇచ్చిన ఏ సలహాలను, సూచనను పట్టించుకోలేదు... అందువల్లే జోగయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలావుంటే తెలుగుదేశం‌-జనసేన ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన 'జెండా' బహిరంగ సభకు ముందు కూడా జోగయ్య పవన్ కు లేఖ రాసారు. తాడేపల్లిగూడెం సభా వేదికగా బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలని జోగయ్య కోరారు. కాపులు భాగస్వాములుగా వున్న బలహీన వర్గాలు యాచించే స్థితి నుండి శాసించే స్థాయికి చేరాలని... ఇందుకోసం రాజ్యాధికారం సాధించడమే మార్గమని అన్నారు. కాబట్టి టిడిపి-జనసేన కూటమి పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని కోరానని గుర్తుచేసారు. భూస్వామ్య అగ్రవర్ణ ఆధిపత్యం కలిగిన వైసిపి ప్రభుత్వ అరాచక పాలనను అంతంచేసి బలహీన వర్గాల పాలన రావాలని కోరుకున్నట్లు జోగయ్య తెలిపారు. 

Also Read నా నాలుగో పెళ్లాం నువ్వే జగన్ .. అయితే రా : పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జగన్ పాలన అట్టర్ ఫ్లాప్ సినిమా .. దానికి సీక్వెల్ వుండదు : తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు పంచ్‌లు

ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో టిడిపి-జనసేన కూటమిలో పవన్ స్థానం ఏమిటో అర్థం కావడంలేదని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బలహీనవర్గాల రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లు కనబడుతోందన్నారు. అధికారంలో సగబాగం జనసేనకు దక్కాలి... పవన్ కు గౌరవప్రదమైన హోదా, మంచి పదవి దక్కాలన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిర్ణయాలు తీసుకునే సర్వాధికారాలు పవన్ కు దక్కాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ అంశాలపై తాడేపల్లిగూడెం సభలో క్లారిటీ ఇవ్వాలని... లేదంటే తాను వేరే నిర్ణయాలు తీసుకుంటానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. 

అయితే నిన్న(బుధవారం) జరిగిన తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబుగాని, పవన్ గానీ హరిరామ జోగయ్య సంధించిన అంశాలగురించి మాట్లాడలేదు. దీంతో తీవ్ర అసహానికి గురయిన ఆయన ఈ కూటమికి ఇక సలహాలివ్వడం మానేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని బహిరంగ లేఖ ద్వారా చంద్రబాబు, పవన్ లకు తెలియజేసారు.