‘పవన్ అంటే అభిమానమే.. కానీ మాకూ ఓ లెక్కుంది’
రాజకీయాల నుంచి తప్పుకుంటా
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటే.. తనకు వ్యక్తిగతంగా చాలా అభిమానమని యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ప్రజా పోరాట యాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ పర్యటనలో భాగంగా ఆయన అధికార పార్టీపై పలు విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనపై చేసిన ఆరోపణలను 15 రోజుల్లో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. తనకు పవన్ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా అభిమానమని, అలాగని లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. పవన్ కల్యాణ్ లాగే తమక్కూడా తిక్కుందని...దానికో లెక్కుందన్నారు. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఆ లెక్కేంటో చెబుతామని పంచకర్ల రమేష్బాబు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలు నిజమని
నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు.