14 ఏళ్లు జైలు శిక్ష.. కోర్టులోనే గొంతు కోసుకున్న ఖైదీ
తనకు 14 ఏళ్లు జైలు శిక్ష పడటాన్ని తట్టుకోలేని ఓ ఖైదీ కోర్టులోనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రోలుగుంట మండలానికి చెందిన రాజాన అప్పలనాయుడు కొందరితో కలిసి 2016లో కారులో గంజాయిని తరలిస్తుండగా.. మాకవరపాలెం మండలం పైడిపాల వద్ద పోలీసులు పట్టుకున్నారు
తనకు 14 ఏళ్లు జైలు శిక్ష పడటాన్ని తట్టుకోలేని ఓ ఖైదీ కోర్టులోనే గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. రోలుగుంట మండలానికి చెందిన రాజాన అప్పలనాయుడు కొందరితో కలిసి 2016లో కారులో గంజాయిని తరలిస్తుండగా.. మాకవరపాలెం మండలం పైడిపాల వద్ద పోలీసులు పట్టుకున్నారు..
74 ప్యాకెట్లలో ఉన్న రూ.7 లక్షల విలువైన 148 కేజీల గంజాయిని సీచ్ చేసి అప్పలనాయుడు సహా ఆరుగురిని అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరిచారు. విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న వీరందరిని తుది విచారణలో భాగంగా నిన్న విశాఖపట్నం మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో దోషులుగా నిర్థారించిన న్యాయమూర్తి.. వీరికి 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జడ్జిమెంట్ వినగానే.. షాక్కు గురైన అప్పలనాయుడు... ఒక్కసారిగా జేబులోంచి పేపర్ కటింగ్ చేసే కత్తితో గొంతు కోసుకున్నాడు.
ఈ సంఘటనతో న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అప్పలనాయుడు పరిస్ధితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.