జగన్ పై విమర్శలు..మంత్రులకు చేదు అనుభవం
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో ఇద్దరు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కెఎస్ జవహర్ పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన తర్వాత సభలో జవహర్ మాట్లాడుతూ, జగన్ పై అనుచిత వ్యాఖ్యలు మొదలుపెట్టారు.
ఎప్పుడైతే జగన్ పై మంత్రి జవహర్ విమర్శలు మొదలుపెట్టారో వెంటనే ఓ మహిళ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుంది. ఇది జగన్ పై విమర్శలు చేయటానికి ఏర్పాటు చేసిన రాజకీయ సభ కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. పనిలో పనిగా మంత్రులు చెబుతున్నట్లుగా జగన్ అవినీతిపరుడు కాదంటూ మంత్రితో వాదనకు దిగారు.
కావాలనే మంత్రులంతా జగన్ పై బురదచల్లుతున్నట్లు మండిపడ్డారు. అంతేకాకుండా మంత్రిని మాట్లాడనీయకుండా పదే పదే జగన్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. దాంతో ఏం చేయాలో అర్ధంకాక కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకుని వెళ్ళిపోయారు.