దమ్ముంటే పుంగనూరులో పోటీచేసి గెలువు: చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్
నిజంగానే చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరులో లో పోటీ చేసి గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
విజయవాడ: కుప్పం పర్యటనలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. నిజంగానే చంద్రబాబుకు దమ్ముంటే పుంగనూరులో లో పోటీ చేసి గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు.
''పంచాయితీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పం పరిదిలో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత కూడా చంద్రబాబు కనువిప్పు కలగడంలేదు. ఓటమితో ఆయనలో అసహనం పెరిగిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో కుప్పం వైపు కన్నెత్తిచూడని ఆయన పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయేసరికి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు కుప్పం ప్రజలు గుర్తుకొచ్చారా? అయినా పులివెందుల, పుంగనూరు వచ్చి ఏం చేస్తారు?'' అంటూ నిలదీశారు.
''చంద్రబాబు అధికారంలో వుండగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. నా కొడుకు, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా 15రోజులు జైళ్లో పెట్టించాడు. ఆయన దౌర్జన్యాలను ఎదిరించి మేము గెలిచాం'' అని పెద్దిరెడ్డి వెల్లడించారు.