మంత్రి జోగి రమేష్ ఫొటోగ్రాఫర్ మిస్సింగ్.. చివరగా వాట్సప్ స్టేటస్ లో ఏం పోస్ట్ చేశాడంటే...
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి జోగి రమేష్ ఆఫీసులో పనిచేసే ఫొటోగ్రాఫర్ అదృశ్యమయ్యాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

అవనిగడ్డ : ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రి జోగి రమేష్ ఆఫీసులో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యాడు. కృష్ణాజిల్లా పెడనలోని ఆఫీసులో ఎరగాని ఆదినారాయణ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఆదినారాయణ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. దీనిమీద పెడన సీఐ హబీబ్ బాషా ఈ మేరకు వివరాలు తెలియజేశారు…
మంత్రి జోగి రమేష్ కార్యాలయంలో ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఆదినారాయణ పెడన మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన వ్యక్తి. అతను అదృశ్యం అవ్వడానికి ముందు వాట్సప్ స్టేటస్ లో.. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ రాసిన ఓ లేఖ.. ఉల్లిపాలెం వంతెన దగ్గర దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ వంతెన మచిలీపట్నం-కోడూరు మండలాలను కృష్ణా నది దగ్గర అనుసంధానిస్తుంది.
ఆదినారాయణ కనిపించకుండా పోవడం, అతని వాట్సాప్ స్టేటస్ లో ఇవి కనిపించడంతో కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, మంత్రి కార్యాలయం సిబ్బంది.. ఉల్లిపాలెం వంతెన దగ్గరికి వెళ్లి మంగళవారం ఉదయం గాలింపు చేపట్టారు. ఉల్లిపాలెం వంతెన మీద ఆదినారాయణకు చెందిన బైకు కనిపించింది. దాని దగ్గర్లోనే ఓ కవర్లో ఆదినారాయణ ఫోను, బంగారు గొలుసు, ఉంగరాలు, చెప్పులు కనిపించాయి.
దీంతో కోడూరు పోలీసులు విస్తృతస్థాయిలో గాలింపు చేపట్టారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆదినారాయణ క్రికెట్ బెట్టింగులు చేస్తుంటాడు. దీంతోపాటు ఇతర కారణాలతో భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆదినారాయణకు ఏడాది కిందటే వివాహమైంది. అయితే అదృశ్యం, ఆత్మహత్య ఘటనలపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.
తన కార్యాలయంలో పనిచేసే ఫోటోగ్రాఫర్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టాలని మంత్రి జోగి రమేష్ కలెక్టర్ ను ఆదేశించారు.