గంటా అలకకు కారణమిదే, వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండే పోటీ: చినరాజప్ప
బాబుతో ఫోన్లో గంటా చర్చలు
విశాఖపట్టణం: భీమిలి నియోజవకర్గంపై ఇటీవల వచ్చిన సర్వేపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. వచ్చే ఎన్నికల్లో భీమిలి నుండే గంటా పోటీ చేయనున్నట్టు తనతో చెప్పారని చినరాజప్ప చెప్పారు.
పార్టీ నాయకత్వంతో అసంతృప్తితో ఉన్న ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గురువారం నాడు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప గురువారం నాడు గంటా శ్రీనివాసరావు నివాసంలో మీడియాతో మాట్లాడారు.
భీమిలి నియోజకవర్గంలో తనకు ప్రతిపక్షమే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనకు వ్యతిరేకంగా సర్వే నివేదిక రావడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాను భీమిలి నుండే పోటీచేస్తానని తనకు గంటా చెప్పారని చినరాజప్ప చెప్పారు.
ఈ విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారని చినరాజప్ప చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొనేందుకు అంగీకరించారని కూడ నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు.
మరోవైపు భూ కుంభకోణాల విషయంలో కొందరు పార్టీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా తన పేరును ప్రచారం చేశారని కూడ గంటా శ్రీనివాసరావు మనోవేదన చెందుతున్నారని కూడ సమాచారం.
ఈ విషయాన్ని కూడ ఆయన చినరాజప్ప దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే ఈ విషయమై తన ప్రమేయం లేదని స్పష్టత ఇవ్వాలని కూడ గంటా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై సానుకూలంగా స్పందన రాకపోవడం కూడ గంటా అలకకు కారణంగా చెబుతున్నారు.