విశాఖలో బాబు టూరు: గంటా షాకిస్తారా?
విశాఖలో బాబు టూరు
విశాఖపట్టణం: ఏపీ ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయనను పార్టీ అధినాయకత్వం బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జూన్ 21వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. బాబు పర్యటనలో గంటా శ్రీనివాసరావు పాల్గొంటారా లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది.
ఇటీవల కాలంలో విశాఖ జిల్లాలోని పార్టీ నేతలు, మంత్రుల మధ్య నెలకొన్న విబేధాలు పార్టీ అధినాయకత్వానికి తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్పపాత్రుడు మధ్య సత్సంబంధాలు లేవు.అధికారుల బదిలీల విషయంలోనూ, ఇతర విషయాల్లోనూ కూడ వీరిద్దరి మధ్య అభిప్రాయబేధాలున్నాయి.
రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఇద్దరు మంత్రులు పాల్గొన్నప్పటికీ కూడ ఇద్దరు కనీసం పలకరించుకోలేదు. పార్టీ నాయకత్వం తన పట్ల చిన్న చూపు చూస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు మనస్థాపానికి గురైనట్టు సమాచారం. పార్టీలో కొందరు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభిప్రాయం కూడ నెలకొంది. ఎంపీ ఆవంతి శ్రీనివాసరావుతో మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం కాలేదు.
విశాఖలో చోటు చేసుకొన్న వ్యవహరాలతో అసంతృప్తితో ఉన్న గంటా శ్రీనివాసరావు జూన్ 19వ తేదిన మంత్రివర్గ సమావేశానికి కూడ హజరుకాలేదు. పార్టీ నేతల పోన్లకు కూడ ఆయన స్పందించడం లేదని సమాచారం. అంతేకాదు తన షెడ్యూల్ ను రద్దు చేసుకొని ఇంటికే పరిమితమయ్యారు.
కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండడంతో పాటు పార్టీ నేతల ఫోన్లకు స్పందించకపోవడంతో పార్టీ నాయకత్వం గంటా శ్రీనివాసరావుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. అసంతృప్తితో ఉన్న గంటా శ్రీనివాసరావును బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొందరు పార్టీ సీనియర్లు గంటాతో చర్చలు జరుపుతున్నారని సమాచారం.
ఇదిలా ఉంటే జూన్ 21 వ తేదిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న గంటా శ్రీనివాసరావు సీఎం సభకు హజరౌతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తి కల్గిస్తోంది. సీఎం పర్యటనను పురస్కరించుకొని గంటా శ్రీనివాసరావుతో కొందరు టిడిపి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.