ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిస్తే స్వాగతిస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని.. దాని వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ, తెలంగాణలు మళ్లీ కలవాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే పరిస్ధితి వస్తే స్వాగతిస్తామని బొత్స పేర్కొన్నారు. విభజన చట్టంలోని అంశాలు అమలు కాలేదని.. దాని వల్ల ఏపీకి అన్యాయం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందన్నారు.  రెండు రాష్ట్రాలు  కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ  తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్  పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ,బీజేపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Also REad:కుదిరితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా విధానం: ఉండవల్లి వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే  తొలుత స్వాగతించేది తామేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు  వినిపిస్తామన్నారు.  రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే  న్యాయస్థానంలో  కేసు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు.విభజనచట్టంలో  హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని ఆయన చెప్పారు.