టీడీపీ... తెలంగాణ దేశం పార్టీగా మారింది, ‘‘ రాయలసీమ ’’ను ఆపేయాలట : మంత్రి అనిల్ వ్యాఖ్యలు
టీడీపీ.. తెలంగాణ దేశం పార్టీగా మారిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాటపైకి వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలో మాత్రం టీడీపీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని అనిల్ కుమార్ మండిపడ్డారు.
ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సోమవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కులాలు, మతాలు మధ్య చంద్రబాబు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారని అనిల్ కుమార్ మండిపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే జగన్ పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు లేఖ రాయించారని మంత్రి ఆరోపించారు.
Also Read:ఇరకాటంలో జగన్... రాయలసీమ ఎత్తిపోతలపై స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకత
రాయలసీమ ఎత్తిపోతలను ఆపేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. టీడీపీ ఇప్పుడు తెలంగాణ దేశం పార్టీగా మారిందంటూ అనిల్ కుమార్ సెటైర్లు వేశారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాటపైకి వస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఏపీలో మాత్రం టీడీపీ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని అనిల్ కుమార్ మండిపడ్డారు. బాబు హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్లు కట్టారని మంత్రి గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడే చంద్రబాబు నోరెత్తడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా ప్రాజెక్ట్లకు వ్యతిరేకంగా చంద్రబాబు కేసులు వేశారని అనిల్ కుమార్ ధ్వజమెత్తారు.