మా మనోభావాలు దెబ్బతింటే మౌనంగా ఉండాలా?.. దళితుల సత్తా ఏమిటో చూపిస్తాం: చంద్రబాబుపై మంత్రి ఆదిమూలపు ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులపై రాళ్లదాడి పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. తమ మనోభావాలు దెబ్బతింటే మౌనంగా ఉండాలా? అని ప్రశ్నించారు. యర్రగొండపాలెంలో వైసీపీపై టీడీపీ కుట్రపన్నిందని ఆరోపించారు. యర్రగొండపాలెంలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి ఆదిమూలపు సురేష్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సభకు జనం రాకపోవడంతోనే గొడవలు సృష్టించారిన ఆరోపించారు.
దళితులను అణగదొక్కాలనేదే చంద్రబాబు ప్రయత్నం అని విమర్శించారు. యర్రగొండపాలెంను మరో కారంచేడు చేయాలని చంద్రబాబు చూశారని ఆరోపించారు. దళితులపై రాళ్ల దాడి పాపం చంద్రబాబుదేనని విమర్శించారు. తన క్యాంపు ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు దగ్గరుండి తమ కార్యకర్తలపై దాడి చేయించారని ఆరోపించారు. దళిత సర్పంచ్తో పాటు ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై తాము శాంతియుతంగా నిరసన తెలిపామని అన్నారు. దళితులకు చంద్రబాబు, లోకేష్లు క్షమాపణలు చెప్పాలని కోరామని చెప్పారు. క్షమాపణ చెప్పాలని చంద్రబాబును ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దళితుల సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు.