మామ చేతిలో దారుణ హత్యకు గురైన అల్లుడు
తరిమి తరిమి కత్తితో నరికి...
తన ఇష్టం లేకుండా కూతురిని ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి తన అల్లున్ని దారుణంగా హత్య చేశాడు. కాపాడుకోడానికి పారిపోతున్న అల్లున్ని వెంటాడి మరీ నరికి చంపాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని చిట్టేడు గ్రామానికి చెందిన రాజశేఖర్, నిరోషాలు ప్రేమించుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో ఇరువురి పెద్దలు వీరికి పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో ఆ ప్రేమజంట ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీరు నెల్లూరు సమీపంలోని నాయుడుపేటలో నివాసముంటున్నారు.
అయితే గ్రామంలోని వీరి కుటుంబాల మద్య ఈ ప్రేమ వ్యవహారం చిచ్చు రేపింది. తరచూ ఈ కుటుంబాల మద్య గొడవలు జరిగేవి. అందువల్ల ఈ జంట గ్రామంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ వచ్చేవారు కాదు.
అయితే ఇటీవల తన స్నేహితుడు చనిపోవడంతో అతడి కుటుంబాన్ని పరామర్శిద్దామని రాజశేఖర్ స్వగ్రామానికి వెళ్లాడు. స్నేహితుడి కుటుంబాన్ని పలకరించి తల్లిదండ్రులను కలవడానికి ఇంటికి వెళ్లాడు. ఇంటినుండి తన బైక్ పై తిరిగి వెళుతుండగా నిరోషా తండ్రి రామయ్య కంటపడ్డాడు. దీంతో కోపోద్రిక్తుడైన రామయ్య రాజశేఖర్ పై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రాణాలను కాపాడుకోడానికి గాయాలతో పరిగెత్తినా వదలకుండా వెంటాడి మరీ నరికి చంపాడు. రాజశేఖర్ రోడ్డుపై కుప్పకూలాక చనిపోయాడని నిర్థారించుకుని అక్కడినుండి వెళ్లిపోయాడు.
అనంతరం నిందితుడు రామయ్య హత్యకు ఉపయోగించిన కత్తిని తీసుకుని వెళ్లి కోట పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.