NTR Statue: ఎన్టీఆర్ విగ్రహంపై వైకాపా నేత దాడి.. ఎస్పీ ఆదేశాలతో నిందితుడి అరెస్టు
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు వైసీపీ నేత. ఈ ఘటన దుర్గి మండల కేంద్రంలో జరిగింది. వైసీపీ నేత, జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం దుర్గిలోని బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని విగ్రహాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది
ఏపీలో వైసీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయా ? అంటే.. ఈ ఘటన చూస్తే అవుననే సమాధానం వస్తుంది. గుంటూరు జిల్లా దుర్గిలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహంపై పట్టపగలే ధ్వంసం చేయడానికి యత్నించాడు ఓ వైసీపీ నాయకుడు. దుర్గి మార్కెట్యార్డ్ మాజీ ఛైర్మన్ యలమంద కుమారుడు కోటేశ్వరరావు దాడి చేసినట్టు గుర్తించారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మండల కేంద్రమైన దుర్గిలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి వైసీపీ నాయకుడు కోటేశ్వరరావు సుత్తితో ప్రయత్నించాడు. ఈ ఘటనలో దాడిలో విగ్రహం దెబ్బతింది. సమాచారం అందుకున్న దుర్గి ఎస్సై పాల్... కేసు నమోదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
Read Also: కులాల మధ్య చిచ్చు పెట్టే యత్నం.. రామకుప్పంలో విగ్రహాల వివాదంపై బాబు స్పందన
ఈ ఘటనపై టీపీడీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మహనీయుల విగ్రహాలు ధ్వంసానికి ప్రయత్నించడం దారుణమని వ్యాఖ్యానించారు. వైకాపా నేత కోటేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై టీపీడీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. వైకాపా కార్యకర్త ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. మద్యం మత్తులో చేసిన పనికాదనీ, కావాలనే ఉద్దేశప్వూరంగా చేసిన దాడి అని ఆక్షేపించారు. వైకాపా పాలనలో అరాచకాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ ఘటనపై టీపీడీ సీనియర్ నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటుగా స్పందించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పట్టపగలే ధ్వంసం చేయడం దుర్మార్గమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండదండలతో ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో 10వ తేదీ వరకు స్కూల్స్ బంద్, స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం
ఎన్టీఆర్ విగ్రహంపై దాడి ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. విగ్రహంపై దాడి చేసిన కోటేశ్వరరావును అరెస్టు చేయాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోటేశ్వరరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ ఆదేశంతో దుర్గి స్టేషన్లో కోటేశ్వరరావుపై క్రైం నెంబరు 01/2022గా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు దుర్గి ఎస్ఐ పాల్ రవీంద్ర తెలిపారు. ఇదిలాఉంటే గతేడాది మాచర్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంయమనం పాటించాలని పార్టీ సీనియర్ నేతలు సూచిస్తున్నారు.