చేతబడి అనుమానంతో ఓ మహిళను చంపి.. అయినా చావలేదనుకుని పూరిళ్లకు అగ్గిపెట్టిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

విజయనగరం : ఈ యేడాది జనవరి 10న అర్థరాత్రి దాటిన తరువాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ (67) సజీవ దహనమయ్యింది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్థారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కూడా ఆ విషయం మరిచిపోయారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సరిగా రెండు నెలలకు... గౌరమ్మ ప్రమాదవశాత్తు కాలిపోలేదని, తానే హత్య చేస చంపేశానంటూ అదే గ్రామాని చెందిన ఆర్. సింహాచలం అనే యువకుడు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం చర్చనీయాంశమయ్యింది. దీనికి సంబంధించి బొబ్బలి సీఐ శోభన్ బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు విచారించారు. ఈ సమయంలో సింహాచలం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

‘నాలుగేళ్ల క్రితం నా భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడ చేయడంతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో భార్య పిల్లలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. నిరుడు దసరాకు ముందు నా తండ్రికి చేతబడ చేయడంతో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గౌరమ్మను ఎలాగైనా చంపాలనుకున్నా.. పగలే హత్య చేసి పోలీసులకు లొంగిపోవాలని అనుకున్నా. జనవరి 10న ఓ ఇంటి నుంచి గొడ్డలి, పెట్రోల్ తీసుకుని అర్థరాత్రి దాటిన తరువాత గౌరమ్మ ఇంటికి వెళ్లా. నిద్రిస్తున్న ఆమె మెడ మీద గొడ్డలి తిరగేసి రెండుసార్లు బలంగా కొట్టాను. ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. చేతబడి చేసిందని తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదని నిందితుడు తెలిపాడు.

ఎందుకు లొంగిపోయాడంటే....
ఈనెల 13న అర్థరాత్రి గ్రామంలోని పాతినవలస కనకరాజుకు చెందిన పశువుల శాల కాలిపోయింది. ఆ సమయంలో సింహాచలం అటుగా వెళ్లడం గమనించిన బాధితులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీశారు. పశులక శాలను తాను కాల్చలేదని, గౌరమ్మను కాల్చానని చెప్పడంతో అందరూ భయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడే తప్పు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం బొబ్బిలి ఏజేఎఫ్ సీఎం కోర్టుకు తరలించినట్లు సీఐ శోభన్ బాబు చెప్పారు.