లోకేశ్ తొలి అధికారిక అమెరికా పర్యటన రద్దయింది
పెద్దపెద్ద అమెరికా కంపెనీలతో ఎమ్వోయు లు కుదుర్చుకుని తనకున్న మంత్రాంగ నైపుణ్యాన్ని లోకేశ్ ప్రపంచానికి చాటి చెబుతారని భావించారు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో విదేశాలలో ఉన్నత స్థాయి చర్చలలో పాల్గొనే అవకాశం రాష్ట్ర ఐటి, పంచాయతీ రాజ్ మంత్రి లోకేశ్ నాయుడికి చేజారిపోయింది.
మే నాలుగు నుంచి పదకొండువరకు ముఖ్యమంత్రి అమెరికాలో జరిపే పెట్టుబడుల వేటలో లోకేశ్ పాల్గొనడం లేదు. ఈ మేరకు ప్రభుత్వం ఒక జివొ విడుదలచేసింది. లోకేశ్ అభిమానులను కొంత నిరాశకు గురి చేసింది.
లోకేశ్ తో పాటు, ముఖ్యమంత్రి పిఎ పెండ్యాల శ్రీనివాస రావుకూడా వెళ్లడంలేదని జివొలో పేర్కొన్నారు.గతంలో ఇచ్చిన జివొ ప్రకారం,లోకేశ్ ,పెండ్యాల కూడా అమెరికా పర్యటనలకు వెళ్లాల్సి వుండింది. ఇపుడు ముఖ్యమంత్రి తో సహా ఇపుడు అమెరికా యాత్ర వెళ్తున్న వారి సంఖ్య 17 నుంచి 15కు తగ్గింది.
అమెరికా వెళ్తూన్న ముఖ్యమంత్రి కీలకమయిన ఐటి శాఖ మంత్రి అయిన లోకేశ్ ను ఎందుకు తీసుకువెళ్లడం లేదని చర్చనీయాంశమయింది.
ఎందుకంటే, ఐటి దిగ్గజాలన్నీ అమెరికాలోనే ఉన్నాయి. వాటి పెట్టుబడులు కూడా రావాలి. దీనికి ఐటి మంత్రి లోకేశ్ కూడా ఉండాలి. దానికి తోడు ఐటి మంత్రిగా ఆయనకు తొలి విదేశీ పర్యటన. అందులోనూ ఉన్నత స్థాయి పర్యటన. ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నబృందంలో సభ్యుడు గా వెళ్లాలి. మొదటి పర్యటనకు ఎందుకు అటంకం కల్గిందో అధికార వర్గాలు వెల్లడించలేదు. ఆయన వెళ్లేటపుడుపెద్ద ఎత్తున వీడ్కోలు, వచ్చేటపుడు ఇంకా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పేందుకు కూడ ఆయన అభిమానులు సిద్ధమయ్యారట.
లోకేశ్ ప్రమోషన్ లో భాగంగా అనేక పెద్ద కంపెనీలతో జరిగే ఎమ్వోయు ల మీద లోకేశ్ సంతకం చేసి, ఆయనకున్న గొప్ప మంతనాలాడేశక్తిని ప్రపంచానికి చాటి చెబుతారని భావించారు. అలాంటపుడు అనూహ్యంగా ఇపుడు ఆయన పేరును జాబితానుంచి తీసేశారు.
ముఖ్యమంత్రి ఈ పర్యటనలో కాలిఫోర్నియా, శాన్యోస్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, వాషింగ్టన్ డిసి, న్యూయార్క్,న్యూ జెర్సీ తదితర పట్టణాలలో ఎన్ ఆర్ ఐ లతో పాటు, విదేశీ కంపెనీల ప్రతినిధులతో కూడ చర్చలు సాగిస్తారు.