వైసీపీకి ఓటు వేస్తే.. బీజేపీకి ఓటు వేసినట్టే
మహానాడులో లోకేష్
వైసీపీకి ఓటు వేస్తే.. బీజేపీకి వేసినట్టేనని మంత్రి లోకేష్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన మహానాడు కార్యక్రమం మూడో రోజు అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, వైసీపీలపై మండిపడ్డారు.
ఉద్దానం సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని పవన్ అనడం సరికాదన్నారు. గతం కంటే మెరుగ్గా ఉద్దానం సమస్యను పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం ప్రజలను కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని నరేంద్రమోదీని వైసీపీ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు మోదీకి ఫోన్ చేస్తే.. మరుసటి రోజు వరకు తిరిగి ఫోన్ చేయరని మండిపడ్డారు. అదే వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయితే.. ఏకంగా ప్రధాని మోదీ భేటీ అయ్యి వస్తున్నాడని చెప్పారు. దీనిని బట్టే.. వైసీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్పవచ్చన్నారు. గత ఎన్నికల ప్రచారంలో స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలా..? స్వఛ్చ ఆంధ్రప్రదేశ్ కావాలా అంటూ మోదీనే అన్నారని గుర్తు చేశారు.
జగన్, పవన్, బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.