ప్రాణహాని ఎదుర్కుంటున్న విజయవాడ నేత వంగవీటి రాధాకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ ఘటనపై ఆయన ఆరా తీశారు. భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అమరావతి: ప్రాణహానిని ఎదుర్కుంటున్న పార్టీ నేత వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. గన్ మెన్ ను తిరస్కరించడం సరి కాదని ఆయన సూచించారు. భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వంగవీటి రాధాను హత్య చేసే ఉద్దేశంతో రెక్కీ నిర్వహించిన ఘటనపై చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రెక్కీ నిర్వహించిన ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆయన చెప్పారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని ఆయన అన్ారు. వంగవీటి రాధాకు వరుసగా బెదిరింపులు రావడాన్ని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. వంగవీటి రాధాపై దాడి చేసేందుకు కొంత మంది రెక్కీ నిర్వహించినట్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. 

దర్యాప్తును పారదర్శకంగా జరిపి నిందితులను శిక్షించాలని ఆయన డీజీపీని కోరారు. చట్టవ్యతిరేకమైన, హింసాత్మక సంఘటనలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో గుండారాజ్యం నడుస్తోందని, విచారణ జరిపి నిందితులను శిక్షిస్తేనే ప్రాథమిక హక్కులను పరిరక్షించగలుగుతారని ఆయన అన్నారు. అనవసరమైన ప్రభావాలకు లోను కాకుండా, సత్వర పారదర్శక విచారణ జరిపి వంగవీటి రాధాపై దాడికి రెక్కీ నిర్వహించిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

Also Read: మా నాన్న రెక్కీ చేశాడనేది అబద్ధం.. ఆయన ఆరోగ్యం బాలేదు.. : అరవ సత్యం కొడుకు చరణ్ తేజ (వీడియో)

విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా హత్యకు రెక్కీ నిర్వహించారనే విషయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి విజయవాడకు చెందిన కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో కార్పోరేటర్ అరవ సత్యంను పోలీసులు ప్రశ్నించారు పోలీసుల విచారణ సందర్భంగా ఆయన స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవినేని అవినాష్ కు అరవ సత్యం సన్నిహితుడని చెబుతున్నారు. 

రెక్కీ నిర్వహించారని తమ తండ్రిని పోలీసులు విచారణకు తీసుకుని వెళ్లారనే విషయంలో నిజం లేదని అరవ సత్యం కుమారుడు చరణ్ చెప్పారు. తమ తండ్రి రెక్కీ నిర్వహించారని బురద చల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎవరితోనూ గొడవలు లేవని కూడా స్పష్టం చేశారు దానిపై వివాదం సృష్టించవద్దని చెప్పారు.