వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి మామను చంపిన కోడలు
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ కోడలు.. ఆమె ప్రియుడితో కలిసి మామనే అంతమొందించారు. ఆయన ఇంటిలోనే హత్య చేసి బందరు కాలువలో పడేశారు. ఈ కేసులో వారిద్దరికీ జీవిత ఖైదును కోర్టు విధించింది.
అమరావతి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత.. ప్రియుడితో కలిసి మామనే చంపేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆ ఇద్దరు దోషులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే, రూ. 5 వేల చొప్పున జరిమానా విధించింది.
తోట్లవల్లూరు ఎస్ఐ జి రమేశ్ అందించిన వివరాల మేరకు, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో దళిత నేత డక్కమడుగుల ఏసు 2015లో దారుణ హత్యకు గురయ్యాడు. జులై 4వ తేదీన రాత్రి అతని ఇంటిలోనే హత్యకు గురయ్యాడు. డక్కమడుగుల ఏసు కోడలు డక్కమడుగుల పద్మ ఆయన హత్య కేసులో ఏ1 దోషి.
డక్కమడుగుల పద్మకు ఓ వివాహేతర సంబంధం ఉన్నది. ఆ వివాహేతర సంబంధానికి తన మామ డక్కమడుగుల ఏసు అడ్డుగా ఉన్నాడని భావించింది. ఏకంగా ఏసును అంతమొందించాలని పద్మ తన ప్రియుడు చాట్ల అనిల్ కుమార్తో కలిసి ప్లాన్ వేసింది. 2015 జులై 4 రాత్రిన ఆ ప్లాన్ను ఇద్దరూ కలిసి అమలు చేశారు. డక్కమడుగుల ఏసును ఆయన ఇంట్లోనే చంపేశారు. ఏసు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి బందరు కాలువలో పడేసి వచ్చారు.
Also Read: ఆరేళ్ల కాపురం తర్వాత భార్య సొంత చెల్లి అని తెలిసింది.. ఖంగుతిన్న భర్తకు నెటిజన్లు ఏమని సూచించారంటే?
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. కేసులో ఏ1గా డక్కమడుగుల పద్మ, ఏ2గా చాట్ల అనిల్ కుమార్ను అరెస్టు చేశారు.
ఈ కేసులో తుది తీర్పు సోమవారం వెలువడింది. విజయవాడలోని 12వ అదనపు జిల్లా సెషన్సు కోర్టు జడ్జీ పి భాస్కరరావు ఈ తీర్పు వెలువరించారు. ఇద్దరు దోషులకు జీవిత ఖైదు విధించారు.