వైసిపి ప్రధాన కార్యదర్శిగా అప్పిరెడ్డి నియామకం... కీలక బాధ్యతలు అప్పగింత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులయ్యారు.
తాడేపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులయ్యారు. ఆయనకు తాడేపల్లి లోని పార్టీ ప్రధాన కార్యాలయ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు, సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
గతంలో యూత్ కాంగ్రెస్ లీడర్ గా వున్న లేళ్ల అప్పిరెడ్డి పనితనాన్ని గుర్తించిన గత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిర్చి యార్డ్ ఛైర్మన్ గా నియమించారు. ఆ తర్వాత ఆయన గుంటూరు అర్బన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇలా ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు తండ్రయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా మెలిగారు.
READ MORE హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో...విశాఖకు చేరుకున్న విజయసాయి రెడ్డి
ఈ అభిమానంతోనే రాజశేఖర్ రెడ్డి అకాలమరణం తర్వాత అప్పిరెడ్డి వైసిపిలో చేరారు. ఇలా 2014 లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీకి దిగి ఓటమిలయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ సమీకరణల దృష్ట్యా ఏసు రత్నంకు అవకాశం కల్పించారు. అయితే ఈసారి ఎలాగయినా గెలిచి తీరాలని విస్తృతంగా పర్యటనలు, పార్టీ కార్యక్రమాలు చేస్తుండగా పార్టీలో కొత్తగా చేరిన ఏసు రత్నంకు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించడంతో కాస్త నిరాశచెందినా పార్టీకోసం పనిచేశారు అప్పిరెడ్డి.
ఆ తర్వాత కూడా పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా కాదనకుండా సమర్థవంతంగా పూర్తిచేశారు. అంతేకాకుండా ప్రస్తుతం అమరావతి వివాదం, రాజధానుల మార్పు తదితర అంశాలను దృష్టిలో వుంచుకుని అప్పిరెడ్డికి జగన్ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు పార్టీ ప్రధాన కార్యాలయ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.