హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో...విశాఖకు చేరుకున్న విజయసాయి రెడ్డి
కరోనా బారిన పడి గతకొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి కోలుకున్నారు.
విశాఖపట్నం: కరోనా బారిన పడి గతకొద్ది రోజులుగా హైదరాబాద్ లో చికిత్స పొందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిన ఎంపీ తాజాగా హైదరాబాద్ నుండి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో (సాయి సంపత్ ఎయిర్లైన్స్) బయలుదేరిన ఆయన విశాఖపట్నంకు చేరుకున్నారు.
కొద్దిరోజుల క్రితం విజయసాయికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డికి కరోనా వైరస్ సోకినట్లు ఓ ఆంగ్లదినపత్రిక తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డి స్వయంగా ఓ ట్వీట్ చేశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అత్యంత జాగ్రత్తలో భాగంగా తనంత తానుగా వారం నుంచి పది రోజుల క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప టెలిఫోన్ కు కూడా అందుబాటులో ఉండనని చెప్పారు. అయితే, తనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు మాత్రం చెప్పలేదు.
ఇదిలావుంటే విజయసాయి రెడ్డి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కాలంలో విజయసాయి రెడ్డి అమరావతి, విశాఖపట్నం, హైదరాబాదుల మధ్య విస్తృతంగా పర్యటించారు.
ఈ క్రమంలో కరోనాబారిన పడ్డ ఆయన ఇటీవలే కోలుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందిన అనంతరం ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి మరో వారంపాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఇవాళ ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి చేరుకున్నారు.