కృష్ణా జిల్లాలో దారుణం: మాజీ భార్య చెప్పుతో కొట్టిందని  భర్త ఆత్మహత్య

విజయవాడ: భార్య, భర్తల పంచాయితీ లో భాగంగా భర్తను చెప్పుతో కొట్టడంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్న ఘటన విజయవాడలో చోటు చేసుకొంది. మృతుడి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మాజీ భార్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కృష్ణా జిల్లా చాట్రాయి కి చెందిన చుండూరు కిషోర్‌, అదే మండలంలోని సి. గుడిపాడు గ్రామానికి చెందిన బిలుగుది శ్యామలతో ఏడాది క్రితం వివాహమైంది. పెళ్ళైన వారం రోజులకే ఇద్దరు విడిపోయారు. వారిద్దరూ కూడ విడాకులు తీసుకొన్నారు. 

అయితే తనను మాజీ భర్త కిషోర్ వేధింపులకు గురి చేస్తున్నాడని కిషోర్‌పై శ్యామల ఈ నెల 19వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. అయితే శ్యామలను వేధింపులకు గురి చేయనని కిషోర్ రాతపూర్వకంగా హమీ ఇచ్చారు. 

మరునాడు వారిద్దరిని పోలీస్‌స్టేషన్ కు రావాలని పోలీసులు కోరారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వారిద్దరూ వచ్చారు. అయితే ఈ విషయమై పోలీసులు కిషోర్‌తో మాట్లాడుతుండగానే శ్యామల కిషోర్ ను చెప్పుతో కొట్టింది. స్టేషన్‌లోనే అందరి ముందు కొట్టడంతో మనస్తాపానికి గురైన కిషోర్ జూన్ 21వ తేదిన తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఈ మేరకు మృతుడు సూసైడ్ నోట్ ను కూడ రాశాడు. ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కిషోర్ ఆత్మహత్యకు కారణమైన శ్యామలను కఠినంగా శిక్షించాలని మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ధర్నా నిర్వహించారు.