ప్రకాశం టిడిపిలో వైసిపి రచ్చ
గోట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించినా వైసిపి గతం వెంటాడుతూ ఉంది. టిడిపి వారి పెన్షన్లు కోత కోయించి వైసిపి నుంచి తెచ్చుకున్న వాళ్లకే ఇప్పిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ బలరాం రచ్చ చేశారు. గొట్టిపాటి మనుషుల్ని ఇంకా టిడిపి నేతలుగా చూడటం లేదా?
అద్దంకి టిడిపిలో ‘వైసిపి’ రచ్చ భగ్గుమనింది. అద్దంకి ఫిరాయింపు(వైపిసి/టిడిపి) శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్,టిడిపి ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి కి మధ్య మాటా మాటా పెరిగింది. సమావేశంలో ఉన్న మంత్రి పరిటాల సునీతకే చెమటలు పెట్టించింది. చివరకు ఎమ్మెల్యే వాకౌట్ చేసి వెళ్లి పోయారు.
బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో నిన్న జరిగిన గొడవ ఇది.
సమావేశంలో కరణం బలరామ్ మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గపరిధిలో తెలుగుదేశంపార్టీకి చెందిన వారి పెన్షన్లను శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ పీకేసారని ఒక పోటు పొడిచారు. పెన్షన్లు వైసిపికి వెళ్తున్నాయని విమర్శించారు.అంటే, గొట్టిపాటి రవికుమార్ అనుచర బృందం టిడిపిలో చేరినా, వారికి టిడిపి గుర్తింపునిచ్చేందుకు ఒరిజినల్ టిడిపి నాయకులు సిద్ధంగా లేరనేనా అర్థం. ఇదే నిన్నటి సమావేశంలో గొడవ.
నిజానికి, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ మధ్య లోకల్ ఫ్యాక్షన్ ఎప్పటినుంచో ఉంది. ఈ మధ్యలో వారి పార్టీలు వేరయ్యాయి. రవికుమార్ వైసిపి వైపు వెళ్లారు. 2014 లో గెలిచారు. అయితే, వైసిపి బలహీనపరిచే మహత్కార్యంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసిపి ఎమ్మెల్యే గొట్టిపాటిరవికుమార్ ని పార్టీలోకి లాక్కున్నారు. ఇదేమాత్రం బలరాంకు నచ్చలేదు. బలరాం ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఇది గొడవ సద్దుమణగ లేదు. ఇపుడు పెన్షన్ల దగ్గిర ఇరువర్గాలు తన్నుకునే దాకా వెళుతున్నాయి.
తెలుగుదేశం వారిని కాదని వైసిపి నుంచి తాను తెచ్చుకున్న నాయకులు,కార్యకర్తలకు పెన్షన్లను ఇప్పిస్తున్నారని, దీనిని సహించేది లేదని కరణం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ ఆరోపణ మీద గొట్టిపాటి చెంగున లేచారు.
కరణం బలరాం నోటికొచ్చినట్లు అబద్దాలాడుతున్నారని అంటూ విషయమంతా తాను తరువాత వివరిస్తానని మంత్రికి చెప్పి సమావేశంనుండి గొట్టిపాటి నిష్క్రమించారు.
ఈ రగడ జిల్లాలో పెద్ద చర్చనీయాంశమైంది. అద్దంకి నియోజకవర్గ పార్టీకి పెద్దతలనొప్పిగా తయారయిందని, దీనికి పరిష్కారం లేదని పార్టీ నేతలే సమావేశం బయట చర్చించుకోవడం కనిపించింది.
అద్దంకి పరిస్థితి చేజారి పోయేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం పారకపోవడమే నంటున్నారు. అగ్గి మీద ఆజ్యం చల్లినట్లు వైసిసి నుంచి వచ్చిన గొట్టిపాటి రవికుమార్కే
అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పగించడం కరణం వర్గంలో సెగ పుట్టిస్తా ఉంది.
రవికుమార్, కరణం బలరాం వాదులాడుకోంటున్నపుడు సమావేశంలో జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, బాపట్ల పార్లమెంటు సభ్యుడు శ్రీరాం మాల్యాద్రి,రేపల్లె శాసనసభ్యుడు సత్యప్రసాదు, గుంటూరు ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్, పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు,చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్,ఎంఎల్సి పోతుల సునీత, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జీ బిఎన్ విజయకుమార్లుకూడా ఉన్నారు.
రవికుమార్, కరణం బలరాం కలసి వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలిపిస్తారా? గొట్టిపాటికి మళ్లీ టికెట్ ఇస్తే, కరణం ప్రచారం చేస్తాడా? ఈ నియోజకవర్గం లో టిడిపి భవిష్యత్తు అశాజనకంగా లేదని సమావేశానికి వచ్చిన సీనియర్ నాయకులొకరు చెప్పారు.