చంద్రబాబుకు దెబ్బ: జగన్ పార్టీలోకి కన్నబాబు, మోసం చేశారని..
టిడిపి నేత, మాజీ శాసనసభ్యుడు కన్నబాబు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బ తగలనుంది. టిడిపి నేత, మాజీ శాసనసభ్యుడు కన్నబాబు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు.
గత ఎన్నికల్లో ఎలమంచిలిలో టిడిపి విజయానికి తాను ఎంతో కృషి చేశానని, కానీ మాత్రం తనను పట్టించుకోలేదని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ఆయన విమర్శించారు.
నారా లోకేష్ కూడా తనకు హామీ ఇచ్చి మరిచిపోయారని ఆయన అన్నారు. అందుకే తాను వైసిపిలోకి వెళ్లానని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక దేవుడు దిగివచ్చి చెప్పినా వినబోనని అన్నారు.
కాంగ్రెసు పార్టీ నుంచి పోటీ చేసి గతంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా కాకున్నా ఎమ్మెల్సీగానైనా చంద్రబాబు తనకు అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఆయన ఆశలు ఫలించలేదు.
దానికితోడు ఎలమంచిలి నుంచి తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టిడీపి టికెట్ దక్కపోవచ్చుననే భావిస్తున్నారు. అందువల్లనే ఆయన వైసిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.