ఎందుకిలా జరిందబ్బా ?

బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర పార్టీ ఉత్తర్వులు వెలువరించింది. బిజెపి నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించారు. అలాగే ఎమ్మెల్సీ సాయి వీర్రాజును రాష్ట్ర ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత కొంతకాలంగా కన్నా లక్ష్మినారాయణ బిజెపిలో ఉంటూనే ఊగిసలాటలో ఉన్నారు. ఆయన వైసిపి తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగింది. అయితే తర్వాత ఆయన అనారోగ్యం పాలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఆరోగ్యం బాగైన తర్వాత వైసిపిలో చేరతారని ప్రచారం సాగింది.

ఇదిలా ఉంటే ఆయన వైసిపిలో చేరేందుకు స్కెచ్ రెడీ చేసుకోగానే బిజెపి అధిష్టానం కొద్దిగా గట్టిగానే ఆయన మీద గరం అయినట్లు వార్తలొచ్చాయి. ఎవరు పార్టీలోకి రమ్మన్నారు? ఎవరు రమ్మంటే వచ్చారు? ఎవరు వెళ్లమంటే వెళ్తున్నారు అని పార్టీ అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు గుసగుసలు వినబడ్డాయి. అంతా మీ ఇష్టమేనా అని పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారని లీక్ లు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆరోగ్యం బాగైన తర్వాత కూడా కన్నా లక్ష్మినారాయణ వైసిపి వైపు కన్నెత్తిచూడలేదు. దీంతో ఆయన ఇక బిజెపిలోనే సర్దుకుంటారన్న టాక్ నడిచింది. అంతిమంగా ఆయన బిజెపిలోనే స్థిరపడిపోయారు. పార్టీ కూడా ఆయన మీద పెద్ద బాధ్యతలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. మరి బిజెపిని కన్నా లక్ష్మినారాయణ ఏమేరకు ముందుకు నడిపిస్తారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.