కాపులను తప్పుదారి పట్టిస్తున్న జగన్
- కాపు ఉద్యమం చుట్టూ రాజకీయాలు
- జగన్,ముద్రగడలను విమర్శించిన కళా వెంకట్రావ్
కాపు ఉద్యమం చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై మంత్రి కళా వెంకట్రావ్ స్పందించారు. రిజర్వేషన్ల పేరిట జగన్ కాపులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ముద్రగడ పద్మనాభం మరియు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ లపై ఆయన విరుచుకుపడ్డారు. పైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోడానికే ఇలా కులాల పేరుతో ఉద్యమాలను రెచ్చగొడుతోందని అన్నారు.
జగన్ కోసమే యావత్ కాపు జాతిని రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ బలిచేస్తున్నారని మంత్రి విమర్శించారు. అంత చిత్తశుద్ది ఉంటే తన తండ్రి సీఎంగా ఉన్నపుడే జగన్ కాపు రిజర్వేషన్లకై ప్రయత్నించేవారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుకనే వీరికి ప్రజలు గుర్తుకొస్తున్నారని ఎద్దేవా చేసారు. కాపుల మేలు కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు. దీన్ని గుర్తించి కూడా వైసీపి కోసమే ముద్రగడ ఉద్యమాల పేరుతో రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చట్టపరంగా చిక్కులు రాకుండా ఉండేందుకు సీఎం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, అందువల్లే కొంచెం ఆలస్యం జరుగుతోందన్నారు.
కాపు రిజర్వేషన్లపై నియమించిన మంజునాథ్ కమిషన్ను త్వరలో నివేదిక ఇవ్వాల్సిందిగా కేబినెట్ ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాపులను టీడిపికి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నాయని,వాటిని ప్రజలు తిప్పికొడతారని మంత్రి అన్నారు.
ఒకేసారి ఐదుగురు కాపు నేతల్ని రాజ్యసభకు పంపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని ఆయన గుర్తు చేసారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్దిని కోరుకుంటున్న ప్రభుత్వం తమదని అన్నారు. కాపు విద్యార్థులను విదేశాలకు పంపి వారు ఉన్నత చదువులు పూర్తి చేసేలా సహకరిస్తున్నామని కళా వెంకట్రావు స్పష్టం చేసారు.