లోకేష్ పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం...
ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పర్యటన చేయనున్నారు. ఈ సమయంలో ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.

ఒంగోలు : ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కాబోయే సీఎం జూనియర్ అంటూ ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒంగోలు ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ పర్యటన ఉంది. ఈ సమయంలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్లెక్సీల్లో.. ‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్..
అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే..’ అని రాసి ఉంది.
గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇవి ఒంగోలు లోని అద్దంకి బస్టాండ్ సమీపంలో.. ఎన్టీఆర్ విగ్రహందగ్గర, ఫ్లై ఓవర్ కింద.. చర్చ్ సెంటర్, కనిగిరి.. మరి ఒకటిరెండు చోట్ల పెట్టారు. పలు కామెంట్స్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.ఫ్లెక్సీలు పెట్టింది ఎవరో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పనే అనుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీలతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా.. పోలీసులు వాటిని తొలగిస్తున్నారు.
వీటిని గురించి తెలిసి టీడీపీ శ్రేణులు షాక్ అయ్యారు. ప్రస్తుతం కనిగిరిలో నారాలోకేష్ పర్యటనకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక వైసీపీ శ్రేణులే ఇలా చేసి ఉంటారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఈ ఫ్లెక్సీలను మొత్తం తీసేశారు. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే విషయం తెలుస్తుందని అంటున్నారు.
నారా లోకేష్ పాదయాత్ర నుంచి దృష్టి మరిలించేందుకే ఇలా చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిమీద పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. అర్థరాత్రి ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారో ఆరా తీసే పనిలో ఉన్నారు. ఫ్లెక్సీల కారణంగా ఒంగోలులో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.