జనతా కర్ఫ్యూ: ఏపీలో బస్సులన్నీ బంద్, పేర్ని నాని ప్రకటన
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రేపు ఏపీలో జనతా కర్ఫ్యూను పాటించనున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఏపీలో బస్సులను నిలిపేస్తున్నట్లు నాని తెలిపారు.
కర్నూలు: జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఉదయం నుండి రాత్రి వరకు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు రాత్రి నుండే దూర సర్వీసులను పూర్తిగా నిలిపివేస్తున్నామని చెప్పారు.
ప్రైవేట్ సర్వీసులను కూడా నిలిపి వేయాలనికోరామని చెప్పారు. రేపు రాత్రి నుండి సర్వీసులన్నింటినీ పునరుద్దిరిస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ప్రధాని మోదీ స్వచ్చంద జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయాణీకులంతా సహకరించాలని ఆయన కోరారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రైవేట్ వాహనాల రాకపోకలను నిలిపి వేసిందని చెప్పారు. కేవలం ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రం నుండి తమిళనాడు వెళ్లే ప్రయాణీకులు తమ ప్రయాణాలు మానుకోవాలని పేర్ని నాని చెప్పారు.
ఒకవేళ వెళితే ఆ రాష్ట్ర సరిహద్దుల్లోనే వాహనాలను నిలిపి వేసి స్క్రీని టెస్టులను చేయించుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో వెళ్లాలని, ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో తమిళనాడు ప్రయాణం మానుకుంటే ఉత్తమమని అన్నారు.