ఎస్ఈసి నిర్ణయం ప్రజాస్వామ్యయుతంగా లేదు... పునరాలోచించాలి: నాదెండ్ల డిమాండ్ (వీడియో)
పార్టీల సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించాలని ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారని... దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి పునరాలోచన చేయాలన్నారు నాదెండ్ల మనోహర్.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. పార్టీ సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించాలని ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారని... దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం మరోసారి పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, అందరికి అవకాశం కల్పించే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్నారు.
వీడియో
''సంవత్సరం క్రితం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పుడు అధికార పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. ఇతర పార్టీల అభ్యర్థులను మభ్యపెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టారు. చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించారు. వీటన్నింటిని మరచిపోయి ఆగిన చోట నుంచే మొదలుపెట్టాలని ప్రకటించడం సబబు కాదు. పంచాయతీ ఎన్నికల్లో మనం చూశాం. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, బెదిరింపులు వాటితోపాటు కోవిడ్ దృష్ట్యా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాజకీయ పార్టీగా స్వాగతించాం. సుమారు ఈ ఏడాది కాలంలో అభ్యర్ధులను, ఓటర్లను అధికారపక్షం మభ్యపెట్టింది'' అని ఆరోపించారు.
''ఆగిన చోట మళ్లీ ఎన్నికలు ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలను స్వలాభం కోసం వాడుకుంటుంది. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను ఇంటింటికి పంపించి ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలను నిలిపివేస్తామని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నింటిని ఎస్ఈసీ దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలు నిజాయతీగా, పారదర్శకంగా జరగాలంటే... నామినేషన్ల ప్రక్రియను మరోసారి ప్రారంభిస్తే తప్ప అందరికి న్యాయం జరగదని భావిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ కొత్తగా ప్రారంభించేందుకున్న అవకాశాలను పరిశీలించాలి'' అని నాదెండ్ల ఎస్ఈసిని కోరారు.