జనసేనకు 18 శాతం ఓట్లు, సర్పంచ్ పదవులు: మార్పు మొదలైందన్న పవన్
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కనబరచాలని శ్రేణులకు పిలుపునిచ్చారు
తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వచ్చే మూడు దశల్లోనూ ఇదే స్ఫూర్తిని కనబరచాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన నాయకులు, శ్రేణులు ఎంతో ప్రభావశీలంగా పని చేశారని పవన్ ప్రశంసించారు. పార్టీ భావజాలంతో పోటీలో నిలిచి, పార్టీ శ్రేణుల మద్దతు పొందినవారు 18 శాతానికి పైగా ఓట్లు, గణనీయంగా సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు కైవశం చేసుకొన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు.
నాకు అందిన సమాచారం మేరకు విశ్లేషిస్తే 17 వందలకు పైగా పంచాయతీల్లో రెండో స్థానం దక్కిందని… ఈ ఫలితాలు చూస్తుంటే మార్పు మొదలైందని అర్థం అవుతోందని జనసేనాని వ్యాఖ్యానించారు.
ఇది కచ్చితంగా మార్పుకు సంకేతమని.. సామాన్యంగా పంచాయతీ ఎన్నికలు అంటే అధికార పక్షానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు.
అలాంటి పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు ధైర్యంగా నిలబడి పోరాటం చేశారని పవన్ కొనియాడారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన ఆయన వచ్చే మూడు దశల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.