దీపాలు వెలిగించి హారతులు... ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పిలుపు
అంతర్వేది దాడులకు నిరసనగా ధర్మాన్ని పరిరక్షించాలని సంకల్పం చెప్పుకొంటూ ఆడపడుచులు హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
విజయవాడ: హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం, ఆలయ రథాలను దగ్ధం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని ఆడపడుచులందరూ మన ధర్మాన్ని పరిరక్షించేందుకు ముందుకు రావాల్సిన సమయమిదని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ దాడులకు నిరసనగా ధర్మాన్ని పరిరక్షించాలని సంకల్పం చెప్పుకొంటూ ఆడపడుచులు హారతులు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.
''శుక్రవారం(రేపు) ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సమాజంలోని అన్ని సమస్యలను, అన్ని బాధలను తెలుసుకుని వాటిని సహనంతో అర్థం చేసుకునేది మన తల్లులే. ఒక ధర్మాన్ని నిలబెట్టేటప్పుడు అన్నింటినీ ఆలోచించి, అందరికీ సమాన న్యాయం మీరు చేయగలరు. అందుకే రేపు సాయంత్రం 5.30 నుంచి 6.30 మధ్య సంధ్యా సమయంలో మత సామరస్యం కోసం, ధర్మపరిరక్షణ కోసం మీరు దీపాలు వెలిగించండి. ధర్మాన్ని పరిరక్షిద్దాం, మతసామరస్యాన్ని కాపాడుదాం అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని దేవతల్ని వేడుకోవాలని కోరుకుంటున్నాను'' అని సూచించారు.
read more అంతర్వేది రథం దగ్దం... ధర్మ పోరాట ధీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
''మీరు జన్మనివ్వగల తల్లులు కాబట్టి మీరు ఏదైనా యుద్ధం చేస్తే అందులో న్యాయం ఉంటుందని నమ్మేవాడిని. పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య సాగిన పోరులో ఎంతో మంది చనిపోయారు. ఇరు దేశాలలోని మహిళలు తమ కన్నబిడ్డలను ఆ యుద్ధంలో పోగొట్టుకున్నారు. అలా బిడ్డలను పోగొట్టుకున్న రెండు దేశాలలోని తల్లులందరూ ఒక వేదిక మీదకు వచ్చి తమ బాధలను పంచుకున్నారు. ఒక సమస్యను, ఒక అన్యాయాన్ని అర్థం చేసుకోగల శక్తి మహిళలకు ఉంది అని నేను నమ్ముతాను. అందుకే ధర్మ పరిరక్షణకు మత సామరస్యాన్ని కాపాడేందుకు మహిళలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాను'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.