రెండేళ్లలో 28మంది దారుణ హత్య: వైసిపి సర్కార్ పై అనగాని సంచలనం
వైసిపి అధికారంలోని వచ్చిన రెండేళ్లలో 1400 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని టిడిపి ఎమ్మెల్యే అనగాని ఆందోళన వ్యక్తం చేశారు.
గుంటూరు: సినిమాలో విలన్ మాదిరిగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్యాక్షన్ రాజకీయాలకు తెరతీశారని... పక్కా ప్రణాళికలతో దాడులు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో దాదాపు 28 మందిని చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మరో 1400 మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారని అనగాని ఆందోళన వ్యక్తం చేశారు.
టిడిపి నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులపై అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ... కేవలం మాస్క్ అడిగినందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ ను పిచ్చి వాడిగా ముద్ర వేశారన్నారు. న్యాయం చేయమని ప్రశ్నించినందుకు దళితులకు సంకెళ్లు వేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టారని అనగాని మండిపడ్డారు.
READ MORE మైనస్ లోకి గ్రోత్ రేట్... ప్రమాదపు అంచుల్లో ఏపీ: యనమల ఆందోళన
''జగన్ రెడ్డి రోజుకో గంట సేపు కరోనా మీద దృష్టి పెట్టి ఉంటే ఇన్ని కేసులు పెరిగి ఉండేవి కాదు. ప్రశ్నించారని రఘురామకృష్ణం రాజుపై దేశద్రోహం కేసులు పెట్టి సంకెళ్లు వేసి దాడులు చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు'' అని ఆరోపించారు.
''జువారి సిమెంట్, అమర్ రాజు కంపెనీలను ఇబ్బంది పెట్టారు. ప్రతి పక్ష నాయకులందరిని ఇబ్బంది పెట్టారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడు రాజధానులను తీసుకువచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారో అందరం చూశాం. నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'' అని అన్నారు అనగాని.