గరగపర్రు దళితులతో మాట్లాడిన జగన్
మంచీ, చెడూ అందరిలోనూ ఉంటుందని, సమాజంలో అందరూ కలిసి ఉండాలన్నదే తన భావనగా జగన్ చెప్పారు. ఎవరో చేసిన తప్పును కులం అంతటికీ ఆపాదించటం తప్పన్నారు. తప్పును సరిదిద్దుకుంటే ఔన్నత్యం పెరుగుతుందే కానీ తగ్గదని సుద్దులు చెప్పారు.
‘ఎవరివల్లైనా తప్పులు జరిగితే సరిదిద్దుకుందాం. అంతేకానీ కుటుంబాలను వెలేయటం మంచిదికాదు ’....ఇది జగన్మోహన్ రెడ్డి మాటలు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని గరగపర్రులో ఈరోజు పర్యటించారు. గ్రామంలో సాంఘీక బహిష్కరణకు గురైన కుటుంబాలను పరామర్శించారు. ఆ సందర్భంగా ఇరు వర్గాలతోనూ మాట్లాడుతూ, అసలేం జరిగిందో తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చానని చెప్పారు. రెండు పక్షాలతోనూ మాట్లాడుతానని, తప్పులుంటే సరిదిద్దుకుంటే సరిపోతుందని సర్ది చెప్పారు.
మంచీ, చెడూ అందరిలోనూ ఉంటుందని, సమాజంలో అందరూ కలిసి ఉండాలన్నదే తన భావనగా జగన్ చెప్పారు. ఎవరో చేసిన తప్పును కులం అంతటికీ ఆపాదించటం తప్పన్నారు. తప్పును సరిదిద్దుకుంటే ఔన్నత్యం పెరుగుతుందే కానీ తగ్గదని సుద్దులు చెప్పారు.
గ్రామంలోని దళితేతరులు జగన్ తో మాట్లాడుతూ, అందరూ సోదరభావంతో బతకాలనే అనుకుంటున్నట్లు తెలిపారు. సమస్య కొందరి వల్లే తలెత్తిందని, ఇప్పటి వరకూ గరగపర్రు ఆదర్శ గ్రామంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సమస్య గ్రామస్తులకే వదిలేస్తే వెంటనే పరిష్కారమైపోతుందని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ విగ్రహం పెట్టటానికి ఎలాంటి ఇబ్బంది లేదని, తప్పులు రెండు వైపులా ఉన్నాయని జగన్ కు వివరించారు. దాంతో సమస్య పరిష్కారానికి మార్గమేర్పడింది.