వచ్చే ఏడు ఎన్నికలొచ్చే అవకాశం ఉందంటున్న జగన్ చంద్రబాబేమీ పీకలేడు బందర్ పోర్ట్ బాధితులకు సంఘీభావం
వచ్చే ఏడాదే ఎన్నికలు రావచ్చేమో నని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు,ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిఅనుమానం వ్యక్తం చేశారు.
బందరు పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా బుద్దాలపాలెంలో పోరాటం చేస్తున్న స్థానికులను గురువారం నాడు కలుసుకుని జగన్ సంఘీభావం వ్యక్తం చేశారు.
చాలాసేపు వారి కష్టాలను తెలుసుకున్నారు. వారితోనే మాట్లాడించి, భూ సేకరణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పించారు. పోర్టును వ్యతిరేకిస్తున్న వారినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన చంద్రబాబు ద్వంద్వనీతిని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు బందరు పోర్టును వ్యతిరేకించావు. ఇప్పుడు ఏకంగా, చక్కగాపండే లక్షా ఎకరాలు తీసుకునే దుర్మార్గానికి ఒడిగడుతున్నావు, ’ అని విమర్శించారు.
పోర్టు కట్టేందుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని చెబుతూ 5200 ఎకరాల్లోనే పోర్టు నిర్మాణంచేయాలన్నది 2012 నాటి ప్రభుత్వం నిర్ణయమని, ఆమేరకు భూమలు సేకరించాలని ఆయన అన్నారు.
‘ఇష్టం లేకుండ భూములు లాక్కుని రైతుకు వెయ్యి గజాలు భిక్ష వేస్తారట. రెండు పంటలు పండే వరిభూమి లాక్కుని ఏడాదికి 30 వేల చొప్పున పదేళ్లు ఇస్తారట. అంటే మూడు లక్షలు. మూడులక్షలుబ్యాంకులో వేసుకుంటే నెలకే ఆ మొత్తం వస్తుంది. అసలుండి పోతుంది. ఇలాంటి మోసమే రాజధాని అమరావతిలో చేశాడు. ఇపుడు మీదగ్గిర కొస్తున్నాడు ,’ అని ఆయన హెచ్చరిక చేశారు.
రెండేళ్లు ఒపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుందని ఆయన రైతులను ఓదార్చాడు. చంద్రబాబు లాంటి వారు ప్రజల వెంట్రుక కూడా పీకలేరని జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి మూడేళ్లుముగిశాయి. మిగిలింది రెండేళ్లే. దేవుడు దయదలిస్తే వచ్చే సంవత్సరమే ఎన్నికలు రావచ్చు. రాకపోయినా.. ఇక ఆయన పాలన మిగిలింది రెండేళ్లే.. ఓపిక పట్టండన్నారు.
