సిఎంవో పై ఐవైఆర్ బాంబు
- సిఎంవో పనిచేయాల్సిన విధానాన్ని వివరిస్తూనే, ప్రస్తుతం పనిచేస్తున్న తీరును ఎండగట్టారు.
- ఐవైఆర్ మాటల ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోంది.
- అంతేకాకుండా జరుగుతున్న పరిణామాల్లో ఎటువంటి బాధ్యత లేకుండా అపరిమితమైన అధికారాలను మాత్రం చెలాయిస్తున్నట్లు కృష్ణారావు తన లేఖలో ఆరోపించారు.
- చంద్రబాబుకు రాసిన ఏడు పేజీల లేఖలో ఐవైఆర్ అనేక అంశాలను తప్పుపట్టారు.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్యమంత్రి కార్యాలయంపై పెద్ద బాంబే వేసారు. ముఖ్యమంత్రి కార్యాలయం పనితీరును తప్పపడుతూ ఐవైఆర్ ఏకంగా చంద్రబాబునాయుడుకే పెద్ద లేఖ రాయటం సంచలనంగా మారింది. సిఎంవో పనిచేయాల్సిన విధానాన్ని వివరిస్తూనే, ప్రస్తుతం పనిచేస్తున్న తీరును ఎండగట్టారు. ఐవైఆర్ మాటల ప్రకారం ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా జరుగుతున్న పరిణామాల్లో ఎటువంటి బాధ్యత లేకుండా అపరిమితమైన అధికారాలను మాత్రం చెలాయిస్తున్నట్లు కృష్ణారావు తన లేఖలో ఆరోపించారు.
చంద్రబాబుకు రాసిన ఏడు పేజీల లేఖలో ఐవైఆర్ అనేక అంశాలను తప్పుపట్టారు. ముఖ్యమంత్రికి సలహాలివ్వాల్సిన అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. సిఎంకు చేరాల్సిన ఏ ఫైల్ కూడా సరైన పద్దతిలో వెళ్ళటం లేదన్నారు. ఒకపద్దతి ప్రకారం ఫైల్ మైన్ టైన్ చేయటం లేదని, ముఖ్యమంత్రికి ఫైళ్ల మీద తాము ఇస్తున్న సలహాలను రికార్డు చేయడమేలేదని లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కార్యాలయం చాలా అల్లాటప్పాగా నడుస్తూ ఉందని అన్నారు.
తమ కిష్టమైన విభాగాల ఫైళ్ళను మాత్రమే సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి దాకా తీసుకెళుతున్నట్లు ఐవైఆర్ అనుమానిస్తున్నారు. సరైన పద్దతిలో ఫైళ్ళ నిర్వహణ లేనపుడు ముఖ్యమంత్రికి సహకరించటానికి ఇంతమంది ఉన్నతాధికారులు అవసరం లేదని కేవలం ఒక సెక్షన్ అధికారి సరిపోతారని కూడా ఎద్దేవా చేసారు. బాధ్యత లేని అధికార వ్యవస్ధ వల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా ఐవైఆర్ ఆందోళన వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రనే వ్యక్తి అంతిమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఐవైఆర్ గుర్తుచేసారు. కాబట్టి సిఎంవోకి వస్తున్న ఫైళ్ళ విషయంలో సరైన విధానాలను అనుసరించాలని ఐవైఆర్ నొక్కిచెప్పారు. అంతేకాకుండా తాను సూచించిన విధానాలు, పద్దతుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్నది తనకు తెలియచేయాలని చెప్పారు. కాబట్టి నెలరోజుల్లోగా తన సూచనలు, సలహాలపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలు తీసుకున్నది తనకు తెలియజేయాలని కూడా ఐవైఆర్ కృష్ణారావు అడగటం ఇపుడు సంచలనంగా మారింది.
సరే, ఈ లేఖను ఎందుకు రాసింన్న విషయాన్ని పక్కన బెడితే ఇటీవలే బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ స్ధానం నుండి అవమానకరంగా తప్పించిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి ఐవైఆర్ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. అటువంటిది హటాత్తుగా ఇపుడు ఏకంగా చంద్రబాబునే ఉద్దేశించి లేఖ రాయటం ఇపుడు కలకలం రేపుతోంది. ఇదే విషయమై సీనియర్ ఐఏఎస్ అధికారల మధ్య కూడా తీవ్రస్ధాయిలో చర్చ జరుగుతోంది. ఐవైఆర్ కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గనుక సమాధానం రాకపోతే బహుశా న్యాయపరమైన చర్యలు తీసుకుంటారా అన్నఅనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఐవైఆర్ దెబ్బ చంద్రబాబుపై బాగా తగిలేట్లే ఉంది.