పైబర్ నెట్ వెంటబడిన లోకేశ్.
- ఐటీ శాఖ అధికారులతో లోకేష్ సమీక్ష
- 2019 ఎన్నికలే లక్ష్యం
- అధికారులకు దిశానిర్దేశం
పల్లె ప్రగతికి అటు పంచాయతీ రాజ్ శాఖను,ఇటు ఐటీ శాఖను రెండింటిని మిలితం చేసి పరుగులు పెట్టిస్తున్నాడు మంత్రి నారా లోకేష్. అందులో భాగంగా పంచాయతీల్లోకి ఐటీ ని ప్రవేశపెట్టే పనిలో ఆయన నిమగ్నమయ్యారు.అందుకోసం ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ అధికారులను అప్రమత్తం చేస్తున్నాడు.2019 ఎన్నికల నాటికి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో భాగంగా డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఆయన సచివాలయంలో స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఇప్పటివరకు జరిగిన పనులను,పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. ఇప్పటి వరకూ 23,800 కిలోమీటర్ల ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేసినట్లు, అలాగే 23,304 ఇళ్లకు కేబుల్ కనెక్షన్ ఇవ్వడం వివరించారు. మరో 38.969 ఇళ్లకు కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని,అలాగే కస్టమర్ బిల్లింగ్ ను కూడా ప్రారంభించనున్నట్లు వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఫైబర్ నెట్ కేబుల్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి విద్యుత్ శాఖ,ఇతర శాఖ అధికారులతో కలిసి జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చెయ్యాలని మంత్రి వారికి సలహా ఇచ్చారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చెయ్యడానికి పంచాయతీ రాజ్ శాఖ నుండి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామన్నారు మంత్రి లోకేష్.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ అజయ్ జైన్, వైస్ ఛైర్మన్ బాబు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.