క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.

ప్రకాశం జిల్లాలో టిడిపి సీనియర్ నేత, ఎంఎల్సీ కరణం బలరాం వైసిపి వైపు చూస్తున్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. రెండు రోజుల క్రితం శాసనమండలిలో కరణం మాట్లాడిన మాటలు అవే సంకేతాలను పంపుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోయిన ఎన్నికల్లో కరణం అద్దంకి ఎంఎల్ఏ అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయారు. అయినా టిడిపి అధికారంలోకి రావటంతో కొంతకాలం హవా బాగానే సాగింది. ఎప్పుడైతే వైసిపి తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టిడిపిలోకి ఫిరాయించారో అప్పటి నుండి కరణంకు సమస్యలు మొదలయ్యాయి. ఒకవిధంగా టిడిపిలోకి ఫిరాయించిన దగ్గర నుండి కరణంకు గొట్టిపాటి పొగ పెడుతున్నారనే చెప్పాలి.

దానికితోడు గొట్టిపాటి టిడిపిలో చేరిన తర్వాత కరణం మాట పార్టీలో గానీ ప్రభుత్వంలో గానీ ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు. దాంతో కరణం తలెత్తుకుని తిరగలేకున్నారు. దానికితోడు చంద్రబాబు కూడా నియోజకవర్గం విషయంలో కరణాన్ని జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా వార్నింగ్ ఇవ్వటంతో మిగిలిన నేతలకు కరణం పరిస్ధితేంటో అర్ధమైపోయింది.

అందుకే నేతల్లో అత్యధికులు కరణంకు దూరంగా ఉంటున్నారు. దాన్ని కరణం తట్టుకోలేకున్నారు. వచ్చే ఎన్నికల్లో అద్దంకిలో తనకు గానీ తన కొడుకు వెంకటేష్ కు గానీ టిక్కెట్టు రాదన్న విషయం అర్ధమైపోయింది. అప్పటి నుండే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కౌన్సిల్లో కరణం ప్రభుత్వంపై విరుచుకుపడంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

వచ్చే ఎన్నికల్లో వెంకటేష్ కు అద్దంకిలో టిక్కెట్టు హామీ ఇస్తే వైసిపిలో చేరటానికి సుముఖంగా ఉన్నట్లు కరణం వైసిపి అధినేతకు సంకేతాలు పంపారని సమాచారం. అయితే, ఎంఎల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ షరతు విధించారట. దాంతో విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.