త్వరలో జగన్ కు గట్టి దెబ్బ
- వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టిదెబ్బ కొట్టేందుకు చంద్రబాబునాయుడు పెద్ద ప్లానే వేశారు.
వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గట్టిదెబ్బ కొట్టేందుకు చంద్రబాబునాయుడు పెద్ద ప్లానే వేశారు. లాక్కున్న 22 మందిని కాకుండా మరింతమంది ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించటం ద్వారా జగన్ ను బలహీన పరచాలన్నది చంద్రబాబు ఆలోచన. పాదయాత్ర ముగిసేలోగా ఎంత వీలైతే అంతా అసెంబ్లీలో దెబ్బ కొట్టటమే చంద్రబాబు లక్ష్యంగా కనబడుతోంది. అందులో భాగంగానే ముందు రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టారు.
వచ్చే ఏడాది మార్చి నెలలో ఏపికి మూడు రాజ్యసభ సీట్లు దక్కుతుంది. అందులో మామూలుగా అయితే 2 టిడిపికి ఒకటి వైసిపికి దక్కాలి. ప్రతీ రాజ్యసభ స్ధానానికి 46 మంది ఎంఎల్ఏల ఓట్లు అవసరం. ప్రస్తుత పరిస్ధితుల్లో 45 ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓట్ల రూపంలో సరిపోతుంది. వైసిపికి సరిగ్గా 45 మంది ఎంఎల్ఏలే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకొక్కరిని టిడిపి లాక్కున్నా వైసిపి రాజ్యసభ సీటు రాదన్నది వాస్తవం.
విశాఖపట్నం జిల్లా పాడేరు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి దూకటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే 44 ఓట్లతో రాజ్యసీటు సాధించుకోవటం కష్టమే వైసిపికి. అప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవాలంటే టిడిపి నుండి వైసిపికి క్రాస్ ఓటింగ్ జరగాలి. ఉన్న ఎంఎల్ఏలనే నిలుపుకోలేక జగన్ అవస్తులు పడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. అటువంటిది అధికారపార్టీ ఎంఎల్ఏల నుండి ప్రతిపక్షం వైపు క్రాస్ ఓటింగ్ అంటే ప్రస్తుత పరిస్ధితుల్లో సాధ్యమేనా ? అంటే, పార్టీ పెట్టిన దగ్గర నుండి మొదటిసారిగా రాజ్యసభ ఎన్నికల్లో జగన్ కు పెద్ద దెబ్బే తగలబోతోంది.