45పంచాయితీలు కలపడం సాధ్యమేనా?
- 45గ్రామాలను విజయవాడలో విలీనం చేస్తానంటున్న చంద్రబాబు
- విముఖత తెలుపుతున్న పలు పంచాయతీలు
విజయవాడ చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాల్ని దశలవారీగా నగరపాలక సంస్థలో విలీనం చేసి.. నగరాన్ని మహావిజయవాడగా మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. 6నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఈ లోగా ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతుల బాధ్యత విజయవాడ నగరపాలక సంస్థకు అప్పగించేశారు. కార్పొరేషన్ సమావేశాలకు సర్పంచులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని కూడా చెప్పారు. అయితే ఇది జరిగే పనేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.
ఎందుకంటే.. 45గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేయాలంటే.. ఆ గ్రామాల సర్పంచుల అంగీకారం అవసరం. అయితే.. ఈ విషయంలో పలు పంచాయితీలు ఇప్పటికే విముఖత తెలుపినట్లు సమాచారం. మరికొందరైతే ఏకంగా న్యాయ స్థానంలోనే ఈ విషయం తేల్చుకావాలనుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తోంది. మహావిజయవాడలో కలిస్తే పన్నులు పెరిగే అవకాశం ఉందని అందుకే దీనికి అంగీకరించడం లేదని తెలుస్తోంది.
అయితే.. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’ అన్నట్టు.. అనుకున్నది సీఎం కాబట్టి.. ఈ విలీనం జరగక మానదు. కాకపోతే.. చంద్రబుబు 6నెలల్లో పూర్తి చేద్దామనుకుంటున్న ఈ కార్యక్రమం.. కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. నయానో, భయానో సర్పంచులకు చెప్పాల్సింది చెప్పి.. మహా విజయవాడ పూర్తి చేస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.