వచ్చే ఎన్నికలకు జిల్లానే మారిపోతారట
- వచ్చే ఎన్నికలకు ఏకంగా జిల్లానే మార్చేయాలని డిసైడ్ అయ్యారట.
- విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల కానీ భోగాపురం నియోజకవర్గంలో కానీ పోటీ చేయవచ్చని సమాచారం.
- సేఫ్ నియోజకవర్గాలపై సర్వే చేయించుకుని పై రెండింటిని ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
- వచ్చే ఎన్నికల్లో జిల్లాలు, నియోజకవర్గాలు రెడీ అయినా పార్టీ ఏదో ఇంకా తేలలేదు.
- టిడిపి నుండే పోటీ చేస్తారా? లేక జనసేనా? వైసీపీనా అన్నది తేలాలి.
విలక్షణ రాజకీయ నేతగా ప్రచారంలో ఉండి ప్రతీ ఎన్నికలోనూ నియోజకవర్గం మారే అలవాటున్న మంత్రి గంటా శ్రీనివసరావు వచ్చే ఎన్నికలకు ఏకంగా జిల్లానే మార్చేస్తున్నారట. విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం నుండి పోటీ చేయటం అలవాటు. ఎందుకని అడక్కూడదు? ఎందుకంటే ఆయనకు జరుగుబాటవుతోంది కాబట్టి జరిపించుకుంటున్నారు. దశాబ్దాల తరబడి జెండాలు మోసిన లక్షల మంది పేర్లు కనీసం పరిశీలనకు కూడా నోచుకోని ప్రస్తుత రాజకీయాల్లో గంటా తడవొక నియోజకవర్గం మారుతున్నారంటే ఆశ్చర్యమే.
పోటీ చేయటానికన్నా మించిన ఆశ్చర్యం ఇంకోటుంది. అదేంటంటే పోటీ చేసిన చోటల్లా గెలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గం నాలుగవది. మొదటిసారిగా అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు. తర్వాత చోడవరం అసెంబ్లీ నుండి గెలిచారు. మూడోసారి అనకాపల్లి అసెంబ్లీ నుండి విజయం సాధించారు. ఇపుడు భీమిలీ ఎంఎల్ఏ. గంటా విలక్షణ రాజకీయ నేతగా కూడా పేరు సంపాదించారు.
ఎలాగంటే, ముందు టిడిపి నేత. తర్వాత ప్రజారాజ్యంలో చేరారు. అక్కడి నుండి కాంగ్రెస్ లోకి మారారు. పోయిన ఎన్నికల సమయంలో మళ్ళీ టిడిపిలోకి జంప్ చేసారు. రేపటి ఎన్నికల సంగతంటారా? ఆ విషయాన్ని ఇపుడే చెప్పటం కష్టమని ఆయన్ను బాగా తెలిసిన వారు అంటుంటారు. అంతటి చరిత్రున్న గంటా ఈసారి ఏకంగా జిల్లానే మారిపోవాలని అనుకున్నారట. కారణమేమిటంటే, విశాఖపట్నం జిల్లాలో పోటీ చేయటానికి గంటాకు సేఫ్ నియోజకవర్గం లేదట.
జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మూడు రిజర్వుడు నియోజకవర్గాలు. గంటా ఇప్పటికే మూడింటిలో పోటీ చేసేసారు. అంటే ఆరు నియోజకవర్గాలు పోను మిగిలినవి తొమ్మిది. వీటిల్లో ఎక్కడా సేఫ్ నియోజకవర్గం కనబడలేదట. అందుకనే వచ్చే ఎన్నికలకు ఏకంగా జిల్లానే మార్చేయాలని డిసైడ్ అయ్యారట. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల కానీ భోగాపురం నియోజకవర్గంలో కానీ పోటీ చేయవచ్చని సమాచారం. సేఫ్ నియోజకవర్గాలపై సర్వే చేయించుకుని పై రెండింటిని ఎంపిక చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
గంటా ఎక్కడ పోటీ చేసినా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలనే ఎంచుకుంటారు. ఎందుకంటే, సామాజిక వర్గం ఓట్లు పడటంలో కట్టుబాట్లు పనిచేస్తుందని. ఎటూ డబ్బుంది. సామాజికవర్గానికి చెందిన పెద్ద వాళ్ళని పట్టుకుంటే చాలు గెలిచిపోవచ్చన్నది గంటా ఆలోచనగా చెబుతుంటారు. ఇప్పటి వరకూ అదే స్ట్రాటజీ వర్కవుటైంది. అయితే, వచ్చే ఎన్నికల్లో జిల్లాలు, నియోజకవర్గాలు రెడీ అయినా పార్టీ ఏదో ఇంకా తేలలేదు. టిడిపి నుండే పోటీ చేస్తారా? లేక జనసేనా? వైసీపీనా అన్నది తేలాలి.