తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతుల భారీ విరాళం.. బంగారు శంఖం అందజేత (వీడియో)
తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు భారీ విరాళం ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణాలు కానుకగా అందించారు.
తిరుమల శ్రీవారికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక ఛైర్మన్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులు భారీ విరాళం ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణాలు కానుకగా అందించారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాయణ మూర్తి దంపతులు.. అనంతరం బంగారు ఆభరణాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందజేశారు. శ్రీవారి అభిషేకాలు నిర్వహించే సమయంలో వినియోగించేందుకు బంగారు శంఖం సమర్పించారు. దాదాపు రెండు కేజీల బంగారంతో తయారు చేయించిన ఈ శంఖం విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉంటే, జూన్ నెలలో సుమారు 23 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో వెల్లడించారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 116.14 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 1.06 కోట్ల లడ్డూలను విక్రయించామని చెప్పారు. 10.8 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టుగా చెప్పారు. 24.38 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.