ఏ పార్టీలో చేరుతానో త్వరలో వెల్లడిస్తా: జేడీ లక్ష్మీనారాయణ
ఏ పార్టీలో చేరుతానో త్వరలో మీడియాకు వెల్లడిస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పారు.
అమరావతి:కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.
also read:జనసేనకు గుడ్బై: జేడీ లక్ష్మీనారాయణ పయనమెటు?
ఆదివారం నాడు విజయవాడలోని వెస్టిన్ కళాశాల వార్షికోత్సవంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. జనసేనతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమన్నారు. ఈ విషయమై తాను ఏమీ మాట్లాడబోనని చెప్పారు.
రైతుల కోసమే తన ప్రయాణం కొనసాగిస్తానని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. జనసేన పార్టీకి తాను చేసిన రాజీనామాను పార్టీ ఆమోదించిన తర్వాత ఈ విషయమై తాను ఏమీ మాట్లాడబోనని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలే మార్గమని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
గత నెల 30వ తేదీన జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ రాజీనామాను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆమోదించారు.పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంపై జేడీ లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని తన రాజీనామా లేఖలో ప్రస్తావించారు.
జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కూడ ఘాటుగానే స్పందించారు. కనీసం వెయ్యి రూపాయాలనైనా సంపాదించి పార్టీ కోసం ఖర్చు చేయగలరా అంటూ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ కల్యాణ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.