నాకు ప్రభుత్వ సహకారం లేదు... అందువల్లే ఆటంకాలు..: ఆనందయ్య కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం తనకు సహకరిస్తే అన్ని ప్రాంతాలకు కరోనా ఔషధాన్ని అందిస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు.
కృష్ణపట్నం: కరోనా మహమ్మారిని తరిమికకొట్టడానికి తాను అందించే మందుకు కేవలం ప్రభుత్వం నుంచి అనుమతులే వున్నాయని....ఎలాంటి సహకారం లేదని ఆనందయ్య తెలిపారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.
''కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపీణీ సవ్యంగా సాగట్లేదు. పంపిణీకి సరపడా వనరులు సమకూరడం లేదు. విద్యుత్ సౌకర్యం, ఔషధ తయారీకి యంత్ర సామాగ్రి లేదు. కాబట్టి భారీమొత్తంలో ఔషదాన్ని తయారుచేయడం సాధ్యపడటం లేదు'' అని ఆనందయ్య పేర్కొన్నారు.
''కృష్ణపట్నంలో ఔషధ పంపిణీ కొనసాగుతోంది. సోమవారం కేవలం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఔషధాన్ని అందిస్తాం. కాబట్టి స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావద్దు. తదుపరి మందు పంపిణీ ఎప్పుడన్నది త్వరలోనే ప్రకటిస్తాం'' అని ఆనందయ్య తెలిపారు.
read more ఆనందయ్య కుమారుడిని చంద్రగిరికి రప్పించిన చెవిరెడ్డి: భారీగా మందు తయారీ, రేపు పంపిణీ
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ తిరిగి ప్రారంభమయ్యింది. అయితే సర్వేపల్లి శాసనసభా నియోజకవర్గానికి చెందిన 5వేల మందికి ఇవాళ ఆనందయ్య బృందం మందు పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. కేవలం 2వేల మందికి మాత్రమే కరోనా మందును ఆయన పంపిణీ చేయనున్నారు. ఇక యాప్ ద్వారా ఇతర ప్రాంతాలవారికి మందు పంపిణీ చేయడానికి సమయం పడుతుందని ఆనందయ్య చెప్పారు.
ఇక ఆనందయ్య కంట్లో వేసే చుక్కల మందు పంపిణీపై ఏపీ హైకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కంట్లో వేసే చుక్కల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ ముగిసింది. తన నిర్ణయాన్ని హైకోర్టు నేటికి రిజర్వ్ చేసింది.