దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని విదేశీ మోజు, కన్సెల్టెంట్ల పిచ్చి చంద్రబాబుకు ఎక్కడ నుండి వచ్చిందో అర్ధం కావటం లేదంటూ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు జుట్లు పీక్కుంటున్నారు.

ముఖ్యమంత్రికి కన్సెల్టెంట్ల పిచ్చి పట్టుకున్నది. అదికూడా అలాంటి ఇలాంటి కన్సెల్టెంట్లు కాదు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కన్సెల్టేంట్లే కావాలి. మళ్ళీ దేశీయంగా పేరున్న కన్సెల్టెంట్లు పనికిరావు. ఓన్లీ విదేశీ కన్సెల్టెంట్లే. ఎందుకు ఇంతమంది కన్సెల్టెంట్లంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకట. మరి ఈయనగారి పాలనానుభవాన్ని ఏ కాకి ఎత్తుకుపోయిందో ? మంత్రివర్గం ఉన్నది దేనికి? ఉన్నతాధికారులు, సుమారు 300కుపైగా శాఖాధిపతులెందుకున్నట్లో అర్ధం కావటం లేదు.

పర్యాటక రంగం అభివృద్ధికి కన్సల్టెంట్లు, రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్ కు కన్సెల్టెంట్లు, బాబుగారి విదేశీ యాత్రలను రూపొందించేందుకు కన్సెల్టెంట్లే. ఇలా..ప్రతీ ఒక్క రంగంలోనూ కన్సెల్టెంట్ల నియామకమే. హోలు మొత్తం మీద రాష్ట్రంలోని ప్రతీ శాఖలోనూ కన్సెల్టెంట్లను భర్తీ చేద్దామని అనుకుంటున్నారు. అందుకని రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతీ శాఖ కూడా అంతర్జాతీయ స్ధాయి కన్సెల్టెంట్లను నియమించుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.

ఇవన్నీ చూస్తుంటే...చివరకు రాష్ట్ర పగ్గాలను సైతం కన్సెల్టెంట్లకే అప్పగించేస్తే సరిపోతుంది కాదా అని ప్రజలు అనుకుంటారేమో కాస్త ఆలోచించండి చంద్రబాబు గారూ. కన్సెల్టెంట్లు ఏమీ ఊరకేరారు కదా? కోట్ల రూపాయలు వారి మొహానా కొట్టాల్సిందే. ఇంతచేసి చివరకు వారు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమన్నా పాటిస్తారా అంటే అనుమానమే.

రాజధాని మాస్టర్ ప్లాన్ తయారీ కోసం మొదట సింగపూర్ అన్నారు. తర్వాత జపాన్ లోని మాకీ అసోసియేట్స్ అన్నారు. ఆ తర్వాత మలేషియిలోని ప్రముఖ ఆర్కిటెక్ట్ అన్నారు. డిజైన్లు చూడటానికే కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. చైనా, కొరియా, కజకిస్ధాన్ డిజైన్లని చెప్పి చివరకు శ్రీలంక దగ్గర ఆగాము ప్రస్తుతానికి. దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని విదేశీ మోజు, కన్సెల్టెంట్ల పిచ్చి చంద్రబాబుకు ఎక్కడ నుండి వచ్చిందో అర్ధం కావటం లేదంటూ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు జుట్లు పీక్కుంటున్నారు. ఏలిన వారు ముందుముందు ఇంకేమి చెబుతారో చూడాలి......