ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
రాజధాని అమరావతికి వెళుతుండగా ఘటన
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్లంపల్లి సమీపంలో దువ్వలేరు వాగు వద్ద కారు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విజయలక్ష్మి కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తోంది. ఆమె ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్యాపకురాలిగా ఎంపికయ్యంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన తుది పోస్టింగ్ ల జాబితాలో ఈమె పేరు లేదు. కర్నూల్ గుత్తికి చెందిన గిడిగె కృష్ణవేణి ది కూడా ఇదే సమస్య. ఈ విషయం గురించి కనుక్కునేందుకు రాజధాని అమరావతికి వెళ్లాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో కృష్ణవేణి, ఆమె భర్త, విజయలక్ష్మిలు ఇవాళ కారులో అమరావతికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ప్రకాశం జిల్లా వెల్లంపల్లి సమీపంలోని దువ్వలేరు వాగు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో సహా ఈ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయిపోయి మృతదేహాలు అందులో ఇరుక్కుపోయాయి.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బైటికి తీశారు. అనంతరం పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.