వైసీపీ నేత భాస్కర్ రావు హత్య: జైలు నుండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విడుదల
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం నాడు రాజమండ్రి జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టైన విషయం తెలిసిందే.
అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం నాడు రాజమండ్రి జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టైన విషయం తెలిసిందే.
ఈ నెల 24వ తేదీన జిల్లా కోర్టు మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించడంతో జిల్లా జైలు నుండి కొల్లు రవీంద్ర బుధవారం నాడు జైలు నుండి విడుదల చేశారు.
.ఈ ఏడాది జూన్ 29వ తేదీన వైసీపీ నేత భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు వద్ద హత్య చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు ఈ ఏడాది జూలై 4వ తేదీన అరెస్ట్ చేశారు.
ఈ కేసులో జైలులో ఉన్న కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జిల్లా కోర్టులో ఈ నెల 24వ తేదీన కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు ఇవాళ ఆదేశించారు. 14 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అంతేకాదు లక్ష రూపాయాల పూచీకత్తును కూడ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కొల్లు రవీంద్రను ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని అప్పట్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆయన ఆరోపణలు చేశారు.