2019లో ఆత్మకూరు నుండి పోటీ, ఆనం బాబుకు షాకిస్తారా?
నెల్లూరులో మారుతున్న రాజకీయాలు
నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడాలని నిర్ణయించుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొంత కాలంగా ఆయన టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలో ఆనం రామనారాయణరెడ్డి చేరేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. టిడిపి నాయకత్వం వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడాలని భావిస్తున్నారని సమాచారం.
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి టిడిపిని వీడాలని కొంత కాలంగా భావిస్తున్నారు. అయితే ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి మరణం తర్వాత ఆనం సోదరులు ఇటీవల కాలంలో సమావేశమై టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ తరుణంలో టిడిపి నాయకత్వం ఆనం రామనారాయణరెడ్డితో చర్చలు జరిపింది. ఆ సమయంలో కొంత మెత్తబడినట్టుగా కన్పించినా ఆ తర్వాత టిడిపికి గుడ్బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మహనాడు కార్యక్రమానికి కూడ ఆనం రామనారాయణరెడ్డి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలోనే వారం రోజుల క్రితం తన అనుచరులతో హైద్రాబాద్ లో సమావేశమై పార్టీ మార్పు విషయమై చర్చించినట్టు చెబుతున్నారు.
టిడిపిలో తాను కొనసాగలేని పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి రామనారాయణరెడ్డి తన అనుచరులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏ కారణాలతో తాను పార్టీని వీడాల్సి వస్తోందోననే విషయాలను కూడ ఆయన అనుచరులకు వివరించారంటున్నారు. అయితే త్వరలోనే ఆయన తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన నెల్లూరు జిల్లాలో జరిగిన టిడిపి జిల్లా మహానాడుతో పాటు విజయవాడలో జరిగిన రాష్ట్ర మహనాడుకు కూడ హజరుకాలేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి తాను బరిలోకి దిగనున్నట్టు ఆనం రామనారాయణరెడ్డి తన వర్గీయులకు చెప్పారని సమాచారం.