విశాఖలో గ్యాస్ లీకేజీపై ఫోరెన్సిక్ టీమ్ విచారణ: ఏపీ డీజీపీ సవాంగ్
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో న్యూట్రలైజ్ ఉన్నా ఎందుకు వాడలేదనే విషయాన్ని విచారణ చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. విశాఖపట్టణంలోని గోపాలపురంలో ఎల్జీ పాలీమర్స్ లో గురువారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీకైంది.
అమరావతి: ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో న్యూట్రలైజ్ ఉన్నా ఎందుకు వాడలేదనే విషయాన్ని విచారణ చేస్తున్నామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. విశాఖపట్టణంలోని గోపాలపురంలో ఎల్జీ పాలీమర్స్ లో గురువారం నాడు తెల్లవారుజామున గ్యాస్ లీకైంది. దీంతో ఎనిమిది మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.
ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటనపై తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీఎం సమీక్ష సమావేశం తర్వాత సవాంగ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైన ఘటన తర్వాత స్థానికుల నుండి 100 నెంబర్ కు ఫోన్ చేసినట్టుగా డీజీపీ తెలిపారు. ఈ సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు.
also read:విశాఖలో గ్యాస్ లీకేజీ: కారణం ఇదీ...
గ్యాస్ లీకైన విషయాన్ని గుర్తించిన పోలీసులు ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావాలని మైకుల ద్వారా కోరారని చెప్పారు. తద్వారా చాలా మంది ఇళ్లలో నుండి బయటకు వచ్చారన్నారు. ఇళ్లలోనే నిద్రలో ఉన్నవారిని కూడ తలుపులు బద్దలు కొట్టి బయటకు తీసుకొచ్చినట్టుగా ఆయనచెప్పారు.ఇవాళ ఉదయం ఐదున్నరకే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన వివరించారు.
గ్యాస్ లీకైన తర్వాత గాలిలో నీటిని స్ప్రే చేసినట్టుగా సవాంగ్ తెలిపారు.ఈ గ్యాస్ లీకేజీకి నీటిని స్ప్రే చేయడమే యాంటీ డోస్ అని డీజీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది ఉన్నారని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడానికి గల కారణాలను ఫోరెన్సిక్ టీమ్ వివరాలను సేకరించనున్నట్టుగా డీజీపీ చెప్పారు.